Asianet News TeluguAsianet News Telugu

దాసరి మృతికి అసలు కారణం వెల్లడించిన కూతురు హేమాలయ

  • దాసరి అనారోగ్యంపై మాట్లాడిన కూతురు హేమాలయ
  • డయాబెటిస్ తప్ప మరే వ్యాధి లేని దాసరి
  • బరువు తగ్గే ఆపరేషన్లే కొంప ముంచాయంటున్న హేమాలయ
the reason for dasari death is his BARIATRIC surgery for weight loss

జనవరి నెలలో దాసరి నారాయణ రావు తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారనే వార్త బయటకు వచ్చినప్పుడు సినీ పరిశ్రమే కాదు సామాన్య ప్రజానీకం కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎలాంటి తీవ్ర అనారోగ్య సమస్యలు లేని దాసరి ఐసీయూ లో చికిత్స తీసుకునే అంత అనారోగ్యం ఏంటనేదే అందరి అనుమానం. చివరికి అన్నవాహిక దెబ్బతిన్నదని, దానివల్ల ఇన్ఫెక్షన్లు తన ప్రాణం మీదకు తెచ్చాయని తేలింది. అయితే చికిత్స అనంతరం దాసరి ఆరోగ్యం కుదట పడటంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఇటీవల తన పుట్టినరోజు వేడుకలు కూడా ఘనంగా జరుపుకోవడంతో అంతా గండం గడిచిందనుకున్నారు. అయితే మళ్లీ నెలలోపే దాసరి నారాయణ రావు ఆస్పత్రి పాలయ్యారు. ఈ సారి మాత్రం నమ్మలేని నిజాన్ని వినాల్సి వచ్చింది. రెండు మేజర్ ఆపరేషన్లతో గుండె తట్టుకోలేక పోయింది.

 

నిజానికి దాసరికి వయస్సుతో పాటే వచ్చే మధుమేహం తప్ప మరే దీర్ఖకాలిక వ్యాధులు లేవు. అయితే బరువు తగ్గేందుకు దాసరి తీసుకున్న నిర్ణయాలే మృతికి కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బరువు తగ్గాలని నిర్ణయించుకున్న దాసరి డాక్టర్ల సలహా మేరకు బేరియాట్రిక్ సర్జరీకి సిద్ధమయ్యారు. అయితే 75 ఏళ్ల వయస్సులో బేరియాట్రిక్ సర్జరీ మంచిది కాదని అతని సన్నిహితులు వారించినా దాసరి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ ఆపరేషన్ అత్యంత క్లిష్టమైందని డాక్టర్లు చెప్తూనే ఉంటారు. బాడీలోని కొవ్వును బయటకు తీసే క్రమంలో పలు సర్జరీలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే దాసరి అన్నవాహికకు గాయం అయినట్లు ప్రచారం జరిగింది.

 

దాసరి ఆరోగ్యంపై జరిగిన చర్చలు నిజమేననేలా ఆయన కుమార్తె హేమాలయ తాజాగా చెప్పిన మాటలు బలాన్నిస్తున్నాయి. ఆమె ఏమన్నారంటే.. బరువు తగ్గేందుకు తోడ్పడే సర్జరీ ఒకటి నాన్నగారు గత ఏడాది చేయించుకున్నారు. అప్పుడది బాగానే పని చేసింది. ఐతే జనవరిలో రెండోసారి కూడా అలా బెలూన్ వేయించుకొనే సర్జరీకి వెళ్లారు. కానీ మొదటిసారి సర్జరీ చేసిన డాక్టర్ ఈసారి లేరు. దీంతో మరో డాక్టర్ తో ఆ సర్జరీ చేయించుకున్నారు. ఇంటికొచ్చాక అది సీరియస్ అయింది. మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లి చూపిస్తే... సర్జరీ ఫెయిలైంది.. అన్నవాహికలో బెజ్జం పడిందని చెప్పారు. అలా ఊపిరితిత్తుల్లో నీరు చేరిపోయింది.

 

అక్కడ నుంచి వరుసగా రకరకాల సర్జరీలు జరిగాయి. ఐతే సీరియస్ కండిషన్ నుంచి ఎలాగోలా బయటపడిన దాసరి.. మార్చి 28న ఇంటికొచ్చారు. అప్పట్నుంచి పొట్ట దగ్గర ట్యూబు ద్వారా ద్రవాహారం తీసుకుంటూ కొద్దిగా కోలుకుంటూ వచ్చారు. ఐతే మామూలుగా నోటి ద్వారా తినేలా అన్నవాహికను పునర్నిర్మించేందుకు ఇంకో సర్జరీ చేయించుకోవాలనుకున్నారు.

 

దాని కోసమే మే మూడో వారంలో ఆసుపత్రిలో చేరారు. అప్పుడు పెద్ద పేగు కట్ చేసి.. అన్నవాహికను నిర్మించే సర్జరీ చేశారు. అది కూడా ఫెయిలైంది. అవయవాలు ఒక్కొక్కటి పని చేయడం మానేశాయి. జరగరానిది జరిగిపోయింది" అని హేమాలయ వివరించారు. దీన్నిబట్టి అధిక బ‌రువు త‌గ్గించే స‌ర్జ‌రీలే దర్శకరత్న దాస‌రి మ‌ర‌ణానికి కార‌ణ‌మని తేలుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios