`ది కాశ్మీర్ ఫైల్స్` డైరెక్టర్ నెక్ట్స్.. `ది వ్యాక్సిన్ వార్`.. అఫీషియల్
`ది కాశ్మీర్ ఫైల్స్` చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తన కొత్త సినిమాని ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్ నేపథ్యంలో ఆయన సినిమాని తెరకెక్కించబోతున్నారు.
`ది కాశ్మీర్ ఫైల్స్` చిత్రంతో సంచలనం సృష్టించారు బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ఈ సినిమా ఇటీవల విడుదలై ఇండియా వైడ్గా రికార్డులు క్రియేట్ చేసింది. నెమ్మదిగా తెలుగు, హిందీ విడుదలై దేశ వ్యాప్తంగా ప్రశంసలందుకుంది. కాశ్మీర్ పండితుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని బీజేపీ బాగా ప్రమోట్ చేసింది. కాశ్మీర్ అనే ఎమోషన్ ఈ సినిమాకి తిరుగులేని విజయాన్ని అందించింది.
తాజాగా ఈ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తన కొత్త సినిమాని ప్రకటించారు. మరో సంచలనాత్మక కథాంశంతో తన నెక్ట్స్ సినిమాని తీయబోతున్నట్టు తెలుస్తుంది. `ది వ్యాక్సిన్ వార్` పేరుతో తన కొత్త సినిమా తీయబోతున్నారు. ఈ విషయాన్ని కాసేపటి(గురువారం) క్రితమే ప్రకటించారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఓ పోరాటం జరిగింది. అనేక దేశాలు ఇదిగో వ్యాక్సిన్, అదిగో వ్యాక్సిన్ అంటూ ప్రకటనలతో హోరెత్తించాయి. ఈ క్రమంలో ఇండియా వ్యాక్సిన్ని కనిపెట్టింది. దీని కోసం చేసిన పోరాటం నేపథ్యంలో ఆ కోవిడ్ 19 వ్యాక్సిన్ నేపథ్యంలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సినిమా తీయబోతున్న నేపథ్యంలో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇక `ది వ్యాక్సిన్ వార్`కి `మీకు తెలియని యుద్ధంతో పోరాడారు, గెలిచింది` అనే క్యాప్షన్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్స్ నిర్మాణంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సమర్పణలో పల్లవి జోషి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 11 ఇండియన్ లాంగ్వేజెస్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం విశేషం. వాటిలో తెలుగుతోపాటు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠీ, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ వంటి భాషలున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్ట్ 15న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది యూనిట్. ఈ సినిమా సైంటిస్టుల విజయాన్ని, టీకా కోసం జరిగిన యుద్ధాన్ని, వారి అంకిత భావాన్ని తెలియజేస్తుందని నిర్మాతలు తెలిపారు.