తనుశ్రీ - నానా పటేకర్ వివాదం.. సాక్ష్యాలు లేవంటున్న పోలీసులు!
బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా.. నటుడు నానా పటేకర్ పై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా.. నటుడు నానా పటేకర్ పై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తమకు ఎలాంటి సాక్ష్యాలు దొరకలేదని అంటున్నారు ముంబై పోలీసులు. దాదాపు పదేళ్ల క్రితం 'హార్న్ ఓకే ప్లీజ్' అనే సినిమా షూటింగ్ సమయంలో నానా పటేకర్ తనతోఅసభ్యంగా ప్రవర్తించారని తనుశ్రీ ఆరోపించింది.
'మీటూ' ఉద్యమానికి తెర లేపింది. ఈ విషయంలో తనుశ్రీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దాంతో విచారణ ప్రారంభించిన పోలీసులు షూటింగ్ సమయంలో ఉన్న పదిహేను మందిని విచారించారు. వారందరూ కూడా తమకేం గుర్తులేదని చెప్పడంతో విచారం కొనసాగించడం కష్టమవుతుందని పోలీసులు అన్నారు.
అయితే దీనిపై స్పందించిన తనుశ్రీ పోలీసులపై మండిపడింది. అసలు ఆ పదిహేను మంది ఎవరని ప్రశ్నించింది. వారు కచ్చితంగా నానా పటేకర్ కి సన్నిహితులే అయ్యుంటారని అలాంటప్పుడు వారు నిజాలెలా చెబుతారని అడిగింది.
తనకు న్యాయం జరిగేలా చేయడానికి కొందరు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారని, కానీ వారికి బెదిరింపులు వస్తున్నాయని, నిందితుడికి ఎప్పటికైనా శిక్ష పడుతుందనే నమ్మకం తనకుందని అన్నారు.