సుశాంత్ ఆత్మహత్య.. సల్మాన్, కరణ్లపై కేసు
కరణ్ జోహార్, సంజయ్ లీలా బన్సాలీ, సల్మాణ్ ఖాన్, ఏక్తా కపూర్లతో పాటు మరో నలుగురి మీద బిహార్లో కేసు నమోదైంది. ప్రముఖ లాయర్ సుధీర్కుమార్ ఈ కేసు వేసినట్టుగా వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిహార్లోని ముజఫర్ కోర్టులో ఐపీసీ 306, 109, 504, 506 సెక్షన్ల కింద ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్టుగా తెలిపారు.
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నెల 14న సుశాంత్ తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఇండస్ట్రీలోని రాజకీయాల కారణంగానే సుశాంత్ ఈ దారుణానికి పాల్పడ్డాడన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో నెపోటిజం (వారసత్వం)ను ప్రోత్సహిస్తున్న వారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, దర్శక నిర్మాత కరణ్ జోహర్లపై కేసు నమోదైంది.
గత ఆరు నెలల కాలంలో సుశాంత్ సింగ్ను ఎన్నో ప్రాజెక్ట్ల నుంచి తొలగించినట్టుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు పలు నిర్మాణ సంస్థలు ఆయన్ను నిషేదించినట్టుగా కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. దీని వెనుక సల్మాన్ ఖాన్, కరణో జోహార్ లాంటి వారు ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా #justiceforSushantSinghRajput అనే హ్యాష్ ట్యాగ్ దేశ వ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది.
ఈ నేపథ్యంలోనే కరణ్ జోహార్, సంజయ్ లీలా బన్సాలీ, సల్మాణ్ ఖాన్, ఏక్తా కపూర్లతో పాటు మరో నలుగురి మీద బిహార్లో కేసు నమోదైంది. ప్రముఖ లాయర్ సుధీర్కుమార్ ఈ కేసు వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిహార్లోని ముజఫర్ కోర్టులో ఐపీసీ 306, 109, 504, 506 సెక్షన్ల కింద ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్టుగా తెలిపారు. సుశాంత్ను ఉద్దేశపూర్వకంగా ఏడు సినిమాల నుంచి తొలగించినట్టుగా ఆయన వెల్లడించారు. సుశాంత్ నటించిన కొన్ని సినిమాల విడుదలను కూడా అడ్డుకున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కోన్నారు. ఈ నేపథ్యంలోనే తీవ్ర మానసిక ఒత్తిడి గురైన సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని సుధీర్ కుమార్ ఆరోపించారు.