ఐఏఎస్ ఎగ్జామ్స్ కి ప్రిపేరయ్యే వారి కోసం సోనూసూద్ ఉచితంగా ఆన్లైన్ కోచింగ్..
లాక్ డౌన్ సమయంలో వేలాది మందికి సహాయం చేసిన రియల్ హీరో అయిన సోనూసూద్ ఐఏఎస్ ప్రీపేర్ అయ్యేవారికి ఉచితంగా కోచింగ్ ఇప్పించబోతున్నారు.
కరోనా టైమ్లో రియల్ హీరోగా పేరుతెచ్చుకున్న నటుడు సోనూ సూద్ తన అంతులేని సేవా కార్యక్రమాల్లో మరో ముందడుగు వేశారు. ఐఏఎస్ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేవారికి ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తున్నారు. 2022-23 ఏడాదికిగానూ ఎంపికైన పేద అభ్యర్థులకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ ఇప్పించనున్నట్టు ప్రకటించారు.
గతేడాది మొదటిసారి ఉచితంగా ఈ ఆన్లైన్ కోచింగ్ ప్రోగ్రామ్ని ప్రారంభించారు సోనూసూద్. దాంట్లో భాగంగా ఈ ఏడాదికి కూడా ఉచితంగా కోచింగ్ ఇప్పించబోతున్నట్టు తెలిపారు. సోనూసూద్ ఛారిటీ ఫౌండేషన్(ఎస్సీఎఫ్), డివైన్ ఇండియా యూత్ అసోసియేషన్(డీఐవైఏ)ల సహకారంతో ఈ ఏడాదికిగానూ `సంభవం స్కాలర్షిప్` అనే కొత్త సెషన్ని ఆయన ప్రారంభించారు.
సంభవం అనేది ఐఏఎస్ పరీక్షలకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్న సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమం. సోనూ సూద్ ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద ఎంపికైన విద్యార్థులు భారతదేశంలోని టాప్ సివిల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూట్లలో ఉచిత ఆన్ లైన్ ఐఏఎస్ కోచింగ్ని పొందుతారు. మెంటర్షిప్ సపోర్ట్ ని, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం, యువత సాధికారత, దేశనిర్మాణానికి కొత్త అవకాశాలను ఏర్పర్చుకోవడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఆర్థికంగా వెనకబడిన అభ్యర్థులకు సమాన అవకాశాలు అందించడం దీని ప్రధాన ఉద్దేశ్యంగా పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా సోనూ సూద్ చెబుతూ, ఐఏఎస్ కావాలనుకునే పేద వారికి సమాన అవకాశాలు అందించాలనే ఉద్దేశ్యంతో, వారికి సరైనా జ్ఞానం అందించాలనేది మా ఉద్దేశ్యం అని చెప్పారు. సోనూసూద్ చొరవతో ఆయన ఫౌండేషన్తో కలిసి ఈ మంచి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందని, ఆర్థికంగా వెనకబడిన అభ్యర్థులకు ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం` అని డిఐవైఏ నిర్వహకులు మనీష్ కుమార్ సింగ్ తెలిపారు.