తనకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ ప్రసారం కాకుండా స్టే ఇవ్వాలని, ఆయా మాధ్యమాల్లో తనను అవమానపరిచేలా ఉన్న కంటెంట్ ను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని సల్మాన్ ఖాన్ న్యాయస్థానాన్ని కోరారు.
మీడియా, సోషల్ మీడియాల్లో అవమానకర వ్యాఖ్యలతో తన పరువు తీస్తున్నారంటూ ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఓ వ్యక్తిపై కేసు వేశారు. న్వేల్ లోని తన ఫాంహౌస్ సమీపంలో ఉండే కేతన్ కక్కడ్ అనే వ్యక్తిపై సల్మాన్ ఖాన్ పరువునష్టం దావా వేశారు. కేతన్ కక్కడ్ ముంబయిలోని మలాడ్ ప్రాంతానికి చెందినవాడు. అతడికి పన్వేల్ లో సల్మాన్ ఫాంహౌస్ కు సమీపంలో కొంత భూమి ఉంది. అయితే, ఇటీవల తన గురించి కేతన్ కక్కడ్ యూట్యూబ్ లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని, తనను కించపరిచేలా మాట్లాడాడని సల్మాన్ ఆరోపించారు.
వెంటనే ఆయా మీడియాల్లో సల్మాన్కు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ను తొలగించేలా లేదా బ్లాక్ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన తరపు లాయిర్లు కోర్టును కోరారు. ఈ క్రమంలో కక్కడ్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను, యూట్యూబ్, గూగుల్, ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి మాధ్యమాలను కూడా సల్మాన్ ఈ కేసులో చేర్చారు. తనకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ ప్రసారం కాకుండా స్టే ఇవ్వాలని, ఆయా మాధ్యమాల్లో తనను అవమానపరిచేలా ఉన్న కంటెంట్ ను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని సల్మాన్ ఖాన్ న్యాయస్థానాన్ని కోరారు.
మరోవైపు కేతన్ తరఫు న్యాయవాదులు ఈ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ.. తమ వాదనలు వినిపించేందుకు కొంత సమయం ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. విచారణకు ఒక రోజు ముందు మాత్రమే తమకు కేసు పత్రాలు అందాయని, మొత్తం వ్యవహారాన్ని పరిశీలించేందుకు సమయం లభించలేదని తెలిపారు. సల్మాన్ ఖాన్ ఈ దావా వేసేందుకు ఒక నెల తీసుకోగా, కక్కడ్కు కూడా సమాధానం చెప్పేందుకు టైం ఇవ్వాలని కోరారు. దీంతో కోర్టు కేతన్కు అనుకూలంగా సమయం మంజూరు చేసింది. కేసును జనవరి 21కి వాయిదా వేసింది.
