`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా టికెట్లు షాకిస్తున్నాయి. ఓ వైపు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్‌ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వడంతో టికెట్‌ రేట్లు పెరిగిపోగా, బెనిఫిట్‌ షోల టికెట్‌ రేట్లు సైతం ఊహించని విధంగా పెరిగిపోవడం గమనార్హం. 

ఇప్పుడు ఎటు చూసిన `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR Movie) పేరు మారుమోగుతుంది. ఆ సినిమా మానియే సాగుతుంది. వరుసగా సినిమా ప్రమోషన్‌లో ఎన్టీఆర్‌(NTR), రామ్‌చరణ్‌(Ram Charan), రాజమౌళి(Rajamouli) పాల్గొంటున్నారు. గ్యాప్‌ లేకుండా పలు సిటీస్‌లో ప్రమోషన్‌ కార్యక్రమాలు చేపడుతున్నారు. శనివారం సాయంత్రం కర్నాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. మరోవైపు భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమా కావడంతో ఈ చిత్రానికి ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు ఏపీ ప్రభుత్వం టికెట్‌ రేట్లు పెంచుకునే అవకాశాన్నిచ్చాయి. 

దీంతో తొలి మూడు రోజులు ఒక‌లా, త‌దుప‌రి 7 రోజులూ మ‌రోలా టికెట్ రేట్లు ఉండ‌బోతున్నాయి. ప‌ది రోజుల్లో రావ‌ల్సిందంతా రాబ‌ట్టుకోవ‌డం సుల‌భం కాబ‌ట్టి, ఆర్‌.ఆర్‌.ఆర్‌కి ఇది క‌చ్చితంగా ప్ల‌స్ పాయింటే. కానీ ఈ రేట్లు సామాన్యుడికి అందుబాటులో ఉంటాయా అనేది ప్ర‌శ్న‌. తెలంగాణలో తొలి మూడు రోజుల్లోనూ టికెట్ ధ‌ర‌.. మ‌ల్టీప్లెక్స్ లో అయితే 413 రూపాయ‌ల వ‌ర‌కూ ఉంది. సింగిల్ థియేట‌ర్ లో అయితే టికెట్ రేటు 236 రూపాయ‌లు. 4వ రోజు నుంచి సింగిల్ థియేట‌ర్లో 212 రూపాయ‌లు. మ‌ల్టీప్లెక్స్ లో అయితే.. 354 ఉంది. ఏపీలో టికెట్ ధ‌ర కాస్త ఫర్వాలేదు. తొలి 10 రోజుల‌కు క‌నిష్టంగా రూ.106 ఉంటే, గ‌రిష్టంగా రూ.380 ఉంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాని గురువారం నుంచి ప్రత్యేకంగా ప్రీమియర్‌ షోలను ప్రదర్శించాలని భావించారు. కానీ వాటిని రాజమౌళి రద్దు చేసినట్టు తెలుస్తుంది. కేవలం మార్నింగ్‌ షోల నుంచే ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారట. అయితే బెనిఫిట్‌ షోల టికెట్‌ ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. చాలా లిమిటెడ్‌గా ప్రదర్శించే ఈ బెనిఫిట్‌ షోకి సంబంధించిన ఒక్కో టికెట్‌ ధర ఏకంగా ఐదు వేల వరకు అమ్ముడు పోతున్నట్టు తెలుస్తుంది. నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు ఈ రేట్లు పలుకుతున్నాయని సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తుంది. ప్రస్తుతం వినిపిస్తున్న టాకే ఇలా ఉంటే, ఇక సినిమా విడుదలకు ముందు రోజు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆ సమయంలో ఒక్కో టికెట్‌ ధర పది వేలకు పోయినా ఆశ్చర్యం లేదంటున్నారు నెటిజన్లు. 

ఇక ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి నటించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌ మూవీ `ఆర్‌ఆర్‌ఆర్‌`. రాజమౌళి రూపొందించిన ఈ పాన్‌ ఇండియా మూవీ ఇది. అలియాభట్‌, ఒలివియా మోర్రీస్‌ కథానాయికలుగా, అజయ్‌ దేవగన్‌, శ్రియా, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. డివివి దానయ్య నిర్మించారు. ఈ సినిమా మార్చి 25న విడుదల కాబోతుంది. ఈ సినిమా డాల్బీ సౌండ్‌తోపాటు త్రీడీలోనూ రాబోతుంది. శనివారం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ విషయంలో అభిమానులు ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్‌ఈవెంట్‌ అంటూ ప్రచారం చేశారని, కానీ తీరా తేలేశారని, ఆశించిన స్థాయిలో ఈవెంట్‌ జరగలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండటం గమనార్హం.