రోబో 2.0పై కేసు, అందుకే విడుదల ఆలస్యం
- సూపర్ స్టార్ రజినీ కాంత్, శంకర్ ల కాంబినేషన్ లో వస్తోన్న 2.0
- పలు కారణాలతో జనవరి విడుదల వాయిదా
- ఏప్రిల్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించిన లైకా సంస్థ
- గ్రాఫిక్స్ ఆలస్యం అవుతున్నందునే సినిమా రిలీజ్ మరింత ఆలస్యం
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న '2.0' సినిమా కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమాను పలు కారణాలతో ఏప్రిల్ చివరి వారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ ఆలస్యం కావడానికి ప్రధాన కారణం విఎఫ్ఎక్స్ వర్క్ నిర్దేశిత సమయానికి పూర్తి కాక పోవడమేనని తెలుస్తోంది.
రోబో ‘2.0' సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ అమెరికాలోని ప్రముఖ విఎఫ్ఎక్స్ కంపెనీలో జరుగుతోంది. అయితే అనుకున్న సమయానికి వారు పని పూర్తి చేయలేదు. తాము ఓ వైపు సినిమా రిలీజ్ పెట్టుకుంటే వారు ఇలా నిర్లక్ష్యం చేయడంతో.. సదరు కంపెనీపై 2.0 నిర్మాతలు కేసు కూడా వేసినట్లు తెలుస్తోంది. అందుకే చిత్రాన్ని వాయిదా వేయక తప్పలేదని అంటున్నారు.
తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది. 2018 ఏప్రిల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం తెలిపారు.
సూపర్స్టార్ రజనీకాంత్ సరసన ఎమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్కుమార్ విలన్గా ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో సుధాంశు పాండే, ఆదిల్ హుసేన్, కళాభవన్ షాజాన్, రియాజ్ ఖాన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.2.0 సినిమా ఇండియాలోనే ఇప్పటి వరకు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం. 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో, హై టెక్నికల్ వాల్యూస్తో హాలీవుడ్ స్థాయిలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.