1920లో జరిగే కథతో రానా నెక్ట్స్, డిటేల్స్
ఈ చిత్రం పీరియడ్ ఎడ్వెంచర్ చిత్రం అని తెలుస్తోంది. రానాని కొత్త లుక్ లో చూపించే ఈ సినిమా 1920లో జరుగుతుందని సమాచారం.

విరాట పర్వం తర్వాత కాస్త స్పీడు తగ్గించి ఆలచనలో పడిన రానా వరస పెట్టి కథలు వింటూనే ఉన్నారు . కానీ ఏదీ ఓకే చెయ్యటం లేదు. తాజాగా ఒక కొత్త సినిమాని లైన్లో పెట్టారని తెలుస్తోంది. అందుతున్న సమాచారం మేరకు రానా హీరోగా దర్శకుడు తేజ ఒక మూవీ చెయ్యబోతున్నారు. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో “నేనే రాజు నేనే మంత్రి” వంటి సూపర్ హిట్ మూవీ రావటంతో ... అదే కాంబినేషన్ లో ఇప్పుడు ఇంకో చిత్రం మొదలుకానుంది. ఈ నెల్లోనే ఈ సినిమా లాంఛనంగా మొదలు కానుందని సమాచారం. ఈ నేపధ్యంలో ఈ చిత్రం మరో పొలిటికల్ సినిమానా అనే డిస్కషన్ మొదలైంది.
అయితే అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం పీరియడ్ ఎడ్వెంచర్ చిత్రం అని తెలుస్తోంది. రానాని కొత్త లుక్ లో చూపించే ఈ సినిమా 1920లో జరుగుతుందని సమాచారం. ఆంధ్రా, మద్రాస్ బోర్డర్స్ లో జరగనుంది. తమిళ,తెలుగు భాషల్లో తీసి ప్యాన్ ఇండియా మూవీ ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది లార్జర్ దేన్ లైఫ్ పీరియడ్ ఎడ్వెంచర్ అని చెప్తున్నారు. యాక్షన్, రొమాన్స్ ప్రధానంగా సాగుతుందని ప్రచారం జరుగుతోంది. ఎవరూ ఊహించని పాయింట్ తో తేజ వచ్చారని ,అందుకే రానా,సురేష్ బాబు వెంటనే ఓకే చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. టాప్ హీరో, దేవుడు, జంబ లకిడి పంబ లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన గోపీనాథ్ ఆచంట ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు
ఇక ఈ మధ్యనే రానా సోదరుడు అభిరామ్ హీరోగా డైరెక్టర్ తేజ తెరకెక్కించిన ‘అహింస’ సినిమా జూన్ 2న విడుదల అయ్యింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన తర్వాతి సినిమా గురించి ప్రకటించారు తేజ. అది కూడా రానాతోనే చేయనున్నట్లు తెలిపారు. టైటిల్ ను కూడా చెప్పేశారు. ‘రాక్షస రాజు’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఎప్పటిలాగే ఈ సినిమాతో కూడా 45 మంది కొత్త వారిని సిల్వర్ స్క్రీన్కు పరిచయం చేయబోతున్నానని తేజ తెలిపారు. ఆసక్తి ఉన్న వాళ్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా తనను సంప్రదించవచ్చని సూచించారు. లెజెండరీ నిర్మాత రామానాయుడు స్వస్థలమైన చీరాల నుంచి కనీసం 10 మంది ఆర్టిస్టులు కావాలని చెప్పారు.
రానా-తేజ సినిమాలో ప్రముఖ మలయాళ హీరో కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం. అతి త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది రెండు భాగాలుగా రాబోతుందని ఫిలిం సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. కథ పెద్దదని అందుకే రెండు పార్టులుగా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రానా ఈ మధ్యనే నిఖిల్ స్పై చిత్రంలో అతిథి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ‘రాక్షస రాజు’ గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మరి.