సారాంశం
విజయం సాధించిన కాంగ్రెస్ కి, ప్రధాన భూమిక వహించిన రేవంత్ రెడ్డికి అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణలో ఎన్నికల ఫలితాలు అధికార పార్టీ బిఆర్ఎస్ కి షాకిచ్చాయి. బిఆర్ఎస్ ఓటమి చెందగా.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తొలిసారి విజయం సాధించి ప్రభుత్వాన్ని స్థాపించబోతోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే రేవంత్ రెడ్డి సీఎం రేసులో ప్రధానంగా కనిపిస్తున్నారు.
కానీ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్లు ఉండడంతో సీఎం ఎవరు అనేది అధికారికంగా తేలాల్సి ఉంది. ఈ క్రమంలో విజయం సాధించిన కాంగ్రెస్ కి, ప్రధాన భూమిక వహించిన రేవంత్ రెడ్డికి అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఎలాంటి సంఘటన జరిగినా ముందుగా అటెన్షన్ కొట్టేసే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ.. కాంగ్రెస్ విజయంపై తనదైన శైలిలో స్పందించారు. 'హాయ్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ.. చాలా ఏళ్ల తర్వాత తొలిసారి కాంగ్రెస్ పార్టీపై నాకు గౌరవం ఏర్పడింది. ఎందుకంటే అది రేవంత్ రెడ్డి వల్లే. ఆయనే తెలంగాణకి కాబోయే సీఎం అని వర్మ తేల్చేశారు.
మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కాబట్టి తెలంగాణాలో ఇది రేవంత్ రెడ్డి విజయమే, కాంగ్రెస్ విజయం కాదు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు అదృష్టం కొద్దీ బాహుబలి లాంటి రేవంత్ రెడ్డి దొరికారు అని రాంగోపాల్ వర్మ కామెంట్స్ చేశారు.