రకుల్ ఇలాంటి క్యారక్టర్ లోనా? కలలో కూడా ఊహించం
మన స్టార్ హీరోయిన్లు కెరీర్ లో ఓ దశకు వెళ్లాక ప్రయోగాలకు సిద్ధపడుతుంటారు. నెక్ట్స్ సినిమాలో మరింత అందంగా ఎలా కనిపించాలా? అని ఎప్పుడూ ఆలోచించే ఈ గ్లామర్ బ్యూటీలు, హఠాత్తుగా డీ-గ్లామరైజ్డ్ పాత్రలో నటిస్తుంటారు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా అలాంటి ప్రయోగానికే రెడీ అయింది.
కెరీర్ ప్రారంభం నుంచీ రకుల్ ప్రీతి సింగ్ గ్లామర్ ప్రదర్శనతోనే సరిపుచ్చుతూ వస్తోంది. నటనకు పెద్దగా అవకాసం లేని పాత్రలు ఆమెవి. అయితే ఇప్పుడు రూటు మారుస్తోంది. రంగస్దలంలో సమంత పాత్ర ఇచ్చిన ప్రేరణతోనో మరేమో కానీ ఆమె ఇప్పుడు ఓ విభిన్నమైన డీ-గ్లామరైజ్డ్ పాత్రలో కనిపించబోతోందని సమాచారం. ఇదొక ప్రయోగంగా భావించి ఆమె చేస్తోందిట. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కోసం ఆమె ఈ నిర్ణయం తీసుకుందిట.
వివరాల్లోకి వెలితే...ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. ఇందులో రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ గత నాలుగు రోజులుగా హైదరాబాదు సమీపంలోని వికారాబాద్ అడవుల్లో నిర్వహిస్తున్నారు.
ఈ సినిమాలో మన గ్రామీణ ప్రాంతాలలో కనిపించే రైతు కూలీ యువతి పాత్రలో రకుల్ నటిస్తోంది. దీంతో ఆమె మేకప్ లేకుండా.. సాదాసీదా డ్రెస్సింగ్ తో కనిపిస్తుందట. ఇన్నాళ్లూ ఓ గ్లామరస్ తారగా ప్రేక్షకులకు కనిపించిన రకుల్.. ఇలా డీ-గ్లామర్ పాత్రను పోషించడం ఓ ప్రయోగం, అంతకుమించి సాహసమనే అంటున్నారు.
ఇక దర్శకుడు క్రిష్...ప్రముఖ నవలా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల రైట్స్ తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. పది లక్షల రూపాయలకు ఈ రైట్స్ తీసుకున్నట్లు చెప్తున్నారు. 2019లో ప్రచురితం అయిన ఈ నవలకు మంచి పేరు వచ్చింది. 2019లో వచ్చిన ఆయన నవల ‘కొండపాలం’ తానా బహుమతి గెలుచుకుంది. సహజమైన పాత్రలతో ఈ సినిమా సాగుతుందని చెప్తున్నారు.
ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రంలో అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేయాలని కృతనిశ్చయంతో ఉన్నాడట క్రిష్. 40 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయనున్నట్టు ఫిలింనగర్ లో వార్త చక్కర్లు కొడుతోంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.