ఫ్యాన్స్ కు రజనీ.. సిద్దమే అంటూ ప్రకటన
రజనీ అనుకున్న తేదీనే వస్తారా? అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చేసింది చిత్ర టీమ్. ఈ చిత్రాన్ని నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సోషల్ మీడియాల వేదికగా వెల్లడించింది.
సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకుడు. కొద్ది కాలం క్రితం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టుని దీపావళి కానుకగా నవంబరు 4న విడుదల చేయనున్నారని ఎప్పటి నుంచో తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే కొవిడ్ సెకండ్ వేవ్ లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు ఎక్కడివక్కడే ఆగిపోయిన సంగతి తెలిసిందే. దాంతో రజనీ నటిస్తోన్న ‘అన్నాత్తే’ సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుందా, లేదా? అనే ప్రశ్న అందరిలోనూ నెలకొంది.ఫ్యాన్స్ చాలా మంది ఈ విషయమై ఓ రేంజిలో సోషల్ మీడియాలో డిస్కషన్స్ పెట్టేసారు.
దాంతో రజనీ అనుకున్న తేదీనే వస్తారా? అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చేసింది చిత్ర టీమ్. ఈ చిత్రాన్ని నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సోషల్ మీడియాల వేదికగా వెల్లడించింది.
‘దీపావళికి అన్నాత్తే.. సిద్ధమా’ అంటూ విడుదల తేదీతో కూడిన ఓ పోస్టర్ని అభిమానులతో పంచుకుంది. ఇందులో రజనీ వెనక్కి తిరిగి ఉంటారు. ఫస్ట్లుక్ త్వరలోనే విడుదల కానుంది. కళానిధి సమర్పణలో సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోంది. ఇంకా ఇందులో కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ, ప్రకాష్ రాజ్, రోబో శంకర్ తదితరులు నటిస్తున్నారు. డి.ఇమ్మాన్ సంగీత స్వరాలు అందిస్తోన్న ఈ సినిమా నవంబర్ 4, 2021 దీపావళికి ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు.
ఇక ఈ చిత్రంలో ఒకప్పుడు వెండితెరపై స్టార్ హీరోయిన్స్ గా వెలిగిన మీనా, ఖుష్బూలు రజనీతో కలిసి నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఇందులో కీర్తి సురేష్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.ఇక తెలుగులో శౌర్యం, శంఖం, దరువు వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శివ... తమిళంలో 'సిరుతై' చిత్రం ద్వారా అడుగుపెట్టారు.
సంక్రాంతి కానుకగా రజనీ-మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన ‘దర్బార్’ రూ.200 కోట్ల క్లబ్లో చేరింది. శివ సినిమా తర్వాత లోకేశ్ కనకరాజు చిత్రంలో రజనీ నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే లోకేశ్ రజనీకి లైన్ చెప్పారని, అది తలైవాకు నచ్చడంతో స్క్రిప్ట్పై పనిచేస్తున్నట్లు కోలీవుడ్ టాక్.