Hero Trailer: రాజమౌళి రిలీజ్ చేసిన `హీరో` ట్రైలర్.. దర్శకులపై షాకింగ్ పంచ్ వేసిన మహేష్ మేనల్లుడు
`హీరో` చిత్ర ట్రైలర్ని దర్శకధీరుడు రాజమౌళి విడుదల చేశారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అశోక్ గల్లా మాస్ పవర్ఫుల్ ఇంట్రడక్షన్తో ట్రైలర్ ప్రారంభమైంది.
మహేష్బాబు(Maheshbabu) మేనల్లుడు, ఎంపీ గల్లాజయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతూ `హీరో`(Hero Movie) చిత్రంలో నటిస్తున్నారు. హాట్ సెన్సేషన్ నిధి అగర్వాల్(Nidhhi Agarwal) కథానాయికగా నటిస్తుంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కాబోతుంది. `ఆర్ఆర్ఆర్`, `రాధేశ్యామ్` వంటి పెద్ద సినిమాలు వాయిదా పడటంతో అనూహ్యంగా `హీరో` సినిమా సంక్రాంతి బరిలోకి దిగింది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల జోరు పెంచింది యూనిట్.
తాజాగా Hero Movie Trailerని దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) విడుదల చేశారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అశోక్ గల్లా ఇంట్రడక్షన్తో ట్రైలర్ ప్రారంభమైంది. `కలల్లో బిర్యాని వండుకుంటే రియాలిటీలో కడుపునిండదురా.. రియాలిటీలోకి రా` అని నరేష్ చెప్పే డైలాగ్, `సినిమాల్లో హీరో అవుదామనుకున్న వాళ్లు చాలా మంది జీవితాలు నాశనం చేసుకున్నారు` అని జగపతిబాబు చెప్పే డైలాగ్లతో చూస్తుంటే హీరో.. సినిమాల్లో హీరో అవ్వాలనుకుంటున్నాడని తెలుస్తుంది. ఆ తర్వాత సినిమా షూటింగ్ తీస్తున్నట్టుగా వచ్చే సన్నివేశాలు.. `అదిరింది.. ఇండియాలో మనమేగా ఫస్ట్ ` అని బ్రహ్మాజీ చెప్పడంలో మరింతగా ఆకట్టుకుంటుంది.
కట్ చేస్తే ట్రైలర్లో హీరో కౌబాయ్ లుక్లోకి మారిపోవడం, హంటింగ్ జరగడం, హీరో.. ఇంట్రడక్షన్ అని చెప్పడం, అనంతరం యాక్షన్ ఎపిసోడ్స్ గూస్బమ్స్ తెప్పించాయి. `ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆపి కథేంటో చెబుతారా? అని నరేష్ అడగ్గా.. నాన్న క్రియేటివ్ పీపుల్ ఎప్పుడు పడితే అప్పుడు కథలు చెప్పరు అని హీరో పంచ్ వేయడం ఆద్యంతం అలరిస్తుంది. మొత్తంగా చివరల్లో దర్శకులపైనే పంచ్ వేసినట్టుంది. తొలి చిత్రంతోనే అశోక్ గల్లా ఇలా దర్శకులపై, ముఖ్యంగా క్రియేటివ్ డైరెక్టర్స్ పై పంచ్ వేయడం ఆసక్తిని పెంచుతుంది. సినిమా ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీని పెంచుతుంది.
మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, సూపర్ స్టార్ కృష్ణ సమర్పణలో అమరరాజా మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై గల్లా పద్మావతి `హీరో` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతి ప్లాన్ చేశారు. కానీ కృష్ణ పెద్దకుమారుడు, మహేష్ అన్న రమేష్బాబు హఠాన్మరణంతో ఈవెంట్ని క్యాన్సిల్ చేశారు. కృష్ణ ఫ్యామిలీ ఈ చిత్ర ప్రమోషన్లో పాల్గొనే ఛాన్స్ లేకపోవడంతో రాజమౌళిని రంగంలోకి దించినట్టు తెలుస్తుంది. ఈ సందర్బంగా చిత్ర బృందానికి, అశోక్ గల్లాకి రాజమౌళి అభినందనలు తెలిపారు.