`టక్ జగదీష్` ఓటీటీపై నిర్మాత వివరణ.. ఆ నమ్మకం లేదు.. ఇంకా రిస్క్ తీసుకోలేమని స్పష్టం..
ఓటీటీ రిలీజ్పై స్పందిస్తూ, థియేటర్ కోసమే ఈ సినిమాను ప్లాన్ చేశాం. ఏప్రిల్లో విడుదల చేద్దామంటే కరోనా వచ్చింది. ఇప్పుడు కూడా పరిస్థితి అలానే ఉంది. త్వరలోనే థర్డ్ వేవ్ అంటున్నారు. ఇక ఇలాంటి పరిస్థితిలో సినిమాను జనాలకు వరకు తీసుకొస్తామా? లేదా? అనే సందేహాలున్నాయ`న్నారు.
నాని హీరోగా నటించిన `టక్ జగదీష్` చిత్రం ఈ నెల(సెప్టెంబర్) 10 ఓటీటీలో విడుదల కాబోతుంది. `నిన్నుకోరి`, `మజిలి` వంటి ఎమోషనల్ కంటెంట్ చిత్రాలను రూపొందించిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో ఈ నెల 10 నుంచి స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో ఓటీటీలో విడుదలపై అనేక అభ్యంతరాలు, విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై నిర్మాత సాహు గారపాటి స్పందించారు. ఆయన మీడియాతో ముచ్చటిస్తూ, `మజిలీ` తరువాత ఇంకాస్త పెద్ద స్కేల్లో ఎమోషన్స్ ఉండాలని అనుకున్నప్పుడు శివ నిర్వాణ ఈ కథ చెప్పారని, నాని దీనికి పర్ఫెక్ట్ సూట్ అవుతారనిపించి ఈ సినిమా చేసినట్టు తెలిపారు.
`ప్రతీ ఇంట్లో ఇలాంటి కొడుకు ఉండాలని అనుకునేలా `టక్ జగదీష్` ఉంటుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎమోషన్ మీదే ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాలు తక్కువయ్యాయి. అందుకే మేం ఇలాంటి కథతో వచ్చాం. ప్రేక్షకులందరూ మంచి సినిమా చూశామని అనుకుంటారు. సినిమా నిడివి రెండు గంటల ఇరవై నిమిషాలు. ద్వితీయార్థం మొత్తం కూడా ఎమోషన్స్ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. కానీ అది చాలా తక్కువ. అక్కా తమ్ముడు, అమ్మ కొడుకు ఇలా అందరి మధ్య ఎమోషన్స్ ఉంటుంది. కంటెంట్ ఎక్కడా దారి తప్పకుండా ఉండేందుకు ఎంటర్టైన్మెంట్ అంతగా జొప్పించలేద`న్నారు.
ఓటీటీ రిలీజ్పై స్పందిస్తూ, `థియేటర్ కోసమే ఈ సినిమాను ప్లాన్ చేశాం. ఏప్రిల్లో విడుదల చేద్దామంటే కరోనా వచ్చింది. ఇప్పుడు కూడా పరిస్థితి అలానే ఉంది. త్వరలోనే థర్డ్ వేవ్ అంటున్నారు. ఇక ఇలాంటి పరిస్థితిలో సినిమాను జనాలకు వరకు తీసుకొస్తామా? లేదా? అనే సందేహాలున్నాయి. వెయిట్ చేయడం రిస్క్త్ తో కూడుకున్నదని భావించి, అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. గత డిసెంబర్లోనే షూటింగ్ ముగిసింది. ఎప్పుడు వీలైతే అప్పుడు థియేటర్లోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నాం. కానీ పరిస్థితుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాం` అని తెలిపారు.
ఇంకా చెబుతూ, `మా సమస్యలు మాకు ఉన్నాయి.. ఇండస్ట్రీ నుంచి కూడా మాకు సపోర్ట్ వచ్చింది. గిల్డ్ నుంచి కూడా మద్దతు లభించింది. అందుకే మేం ఎక్కువగా మాట్లాడలేదు. హీరోలైనా, నిర్మాతలైనా ఎవ్వరైనా సరే.. సినిమాను జనాలకు చూపించాలనే అనుకుంటారు. ఇది జనాలకు పండుగ నాడు చూపించాల్సిన సినిమా. ప్రస్తుతం ఎక్కడా కూడా పరిస్థితులు చక్కబడలేదు. మన పక్క రాష్ట్రాల్లో కూడా ఇంకా అంతగా థియేటర్లు తెరవలేదు. విదేశాల్లోనూ పరిస్థితులు అలానే ఉన్నాయి. అందుకే ఎక్కువ మందికి ఈ సినిమాను రీచ్ అయ్యేలా చేసేందుకు ఓటీటీకి ఇవ్వాల్సి వచ్చింది.
బిగ్ స్క్రీన్లో ఉన్నంత రెవెన్యూ ఓటీటీకి ఉండదు. `ఉప్పెన`, `జాతిరత్నాలు` రిజల్ట్ ఎలా ఉందో అందరం చూశాం. అందుకే రిస్క్ తీసుకుని ఇన్నాళ్లు వెయిట్ చేశాం. కానీ ఇంకా పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో తెలియడం లేదు. అందుకే బయటి పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. రెండు మూడు నెలల్లో అన్ని పరిస్థితులు చక్కబడతాయనే నమ్మకం, ఆశ ఉంది. ఆ నమ్మకం ఉంటేనే బతకగలుగుతాం` అని తెలిపారు.
నెక్ట్స్ సినిమాల గురించి చెబుతూ, అందరు హీరోలతో కలిసి పని చేయాలని అనుకుంటాం. చిన్న హీరోలు, పెద్ద హీరోలు అని కాకుండా అందరితో చేయాలని అనుకుంటాం. అనిల్ రావిపూడి- బాలయ్య ప్రాజెక్ట్ను దసరాకు ప్రకటిస్తాం. నాగ చైతన్యతో కూడా ఓ సినిమా ఉంది. విజయ్ దేవరకొండ బిజీగా ఉండటంతో సినిమా కుదరడం లేదు. ఇంకా కొంచెం సమయం పడుతుంది.