`రాధేశ్యామ్`తో థియేటర్లో సందడి చేస్తున్న ప్రభాస్ నెక్ట్స్ ఒక చిన్న బడ్జెట్ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. మారుతితో ఈ సినిమా ఉండబోతుంది. ఈ సినిమా చేయడానికి అసలు కారణం ఆసక్తిని రేకెత్తిస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా `రాధేశ్యామ్` చిత్రంతో సందడి చేస్తున్నాడు. సినిమా టాక్ ఎలా ఉన్నా విజువల్ వండర్గా నిలుస్తుంది. ఆడియెన్స్ ని కనువిందు చేస్తుంది. ఇదిలా ఉంటే ప్రభాస్ మరో చిన్న సినిమా చేయబోతున్నట్టు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ చిత్రాలకు కేరాఫ్గా నిలిచిన దర్శకుడు మారుతితో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే పలు మార్లు ఓ చిన్న సినిమా చేస్తున్నట్టు ప్రభాస్ తెలిపారు. అయితే `రాధేశ్యామ్` ఫలితంతో ఈ చిత్రంపై సందిగ్ధం నెలకొందనే రూమర్స్ ఊపందుకున్నాయి.
ఈ నేపథ్యంలో దీనిపై మారుతి టీమ్ నుంచి క్లారిటీ వచ్చింది. రూమర్ లో నిజం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు ఏప్రిల్ నుంచి పట్టాలెక్కబోతుందట. శరవేగంగా ఈ చిత్రాన్ని రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. కుదిరితే ఈ ఏడాదిలోగానీ, వచ్చే ఏడాది ప్రారంభంలోగానీ దీన్ని విడుదల చేయాలని భావిస్తుందట యూనిట్. ఈ సినిమాని `ఆర్ఆర్ఆర్` ప్రొడ్యూసర్ డివివి దానయ్య నిర్మిస్తున్నారని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వీలైనంత త్వరలో రాబోతుందని సమాచారం.
ఇదిలా ఉంటే ఈ సినిమాని ప్రభాస్ చేయడానికి అసలు రీజల్ బయటకొచ్చింది. ప్రభాస్ ప్రస్తుతం భారీ సినిమాలు చేస్తున్నారు. `ఆదిపురుష్`, `సలార్` వంటి పాన్ ఇండియా సినిమాల్లో బిజీగా ఉన్నారు. `ఆదిపురుష్` పూర్తి మైథలాజికల్ చిత్రం. అందులో పాటలు, మాస్యాక్షన్ ఉండదు. అదొక విజువల్ వండర్గా, సరికొత్త ట్రీట్నిచ్చేలా ఉంటుంది. మరోవైపు `సలార్` పూర్తి యాక్షన్ మూవీ. `కేజీఎఫ్` డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. `కేజీఎఫ్` తరహాలోనే ఈ సినిమా కూడా యాక్షన్ ప్రధానంగా సాగుతుందని తెలుస్తుంది.
దీంతో తెలుగు ఆడియెన్స్ కి కావాల్సిన పాటలు, ఫైట్స్, కామెడీ ఇలా కమర్షయల్ ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్ ఆయా చిత్రాల్లో ఆశించడం కష్టం. దీంతో వాటి నుంచి రిలీఫ్ కోసం ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ టాక్. తెలుగు ఆడియెన్స్ కి, ముఖ్యంగా తన ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ లాంటి చిత్రాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రభాస్.. మారుతితో ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యిందని, ఏప్రిల్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి జెట్ స్పీడ్తో పూర్తి చేసే ప్లాన్లో ఉన్నారట. పెద్ద సినిమాల షూటింగ్ గ్యాప్లో ఈ చిత్రాన్ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారట.
ఇదిలా ఉంటే ఇందులో ముగ్గురు హీరోయిన్లకి స్కోప్ ఉంటుందని టాక్. గ్లామర్ డోస్ మామూలుగా ఉండబోదని తెలుస్తుంది. ఓ హీరోయిన్గా `పెళ్లి సందడి` ఫేమ్ శ్రీలీలని అనుకుంటున్నారని సమాచారం. మరోవైపు అంతా కొత్త హీరోయిన్లతోనే సినిమా చేయాలనే ఆలోచనలో కూడా యూనిట్ ఉందని తెలుస్తుంది. మాళవిక మోహనన్ పేరు హీరోయిన్గా వినిపించింది. కానీ అందులో నిజం లేదని టాక్. మొత్తంగా వీటిలో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
