ప్రముఖ సింగర్ బిప్రాక్ ఇంట్లో తీవ్ర విషాదం.. అప్పుడే పుట్టి అంతలోనే..
`సరిలేరు నీకెవ్వరు` చిత్రంలో `సూర్యుడివో.. చంద్రుడివో` పాట పాడిన సింగర్ బిప్రాక్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.
ప్రముఖ ఇండియన్ సింగర్ బిప్రాక్(Singer Bpraak) ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పుట్టిన బిడ్డ పొత్తిళ్లలోనే కన్నుమూసింది. పది నెలల క్రితం బిప్రాక్ భార్య మీరా ప్రెగ్నెంట్ అయినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గురువారం మీరా పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. దీంతో ఎంతో మురిసిపోయిందీ బిప్రాక్ జంట. వారి ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. అంతలోనే ఆ ఆనందం ఆవిరైంది. తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పుట్టిన బిడ్డ కొద్దిసేపట్లోనే కన్నుమూసింది. పొత్తిళ్లలోనే ఆ చిన్నారి కన్నుమూయడంతో బిప్రాక్ జంట గుండె బద్దలయ్యింది.
ఈ విషయాన్ని సింగర్ బిప్రాక్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇన్స్టాగ్రామ్లో ఆయనో పోస్ట్ పెట్టి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు మాకు పండంటి బిడ్డ పుట్టింది. కానీ అంతలోనే ఆ బిడ్డ మమ్మల్ని విడిచి శాశ్వతంగా వెళ్లిపోయింది. పుట్టిన సమయంలోనే బిడ్డ చనిపోయింది. ఇది ఓ పేరెంట్స్ గా మేం భరించలేకపోతున్నాం. మా చిన్నారిని కాపాడేందుకు చివరి వరకు ప్రయత్నించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మాకు సపోర్ట్ చేసిన వారికి, అభిమానులకు ధన్యవాదాలు. ఈ సమయంలోనే మా ప్రైవసీని మాకు అందించమని అందరిని వేడుకుంటున్నా` అని తన బాధని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.
బిప్రాక్ పోస్ట్పై పలువురు బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు ధైర్యానిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సింగర్ బిప్రాక్ మంచి సింగర్గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఈవెంట్లతోనూ ఆయన అలరిస్తుంటారు. ఆయన పాటలకు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తెలుగులో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో `సూర్యుడివో చంద్రుడివో` అనే పాట పాడి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. బీప్రాక్, మీరా బచెన్ 2019లో గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. వీరి మ్యారేజ్కి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లు, సినీ సెలబ్రిటీలు భారీగా హాజరయ్యారు.