ఇది ఆరంభం మాత్రమేః నీరజ్ చోప్రాపై పవన్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ ప్రశంసల వర్షం
పవన్, ప్రభాస్, రామ్ వంటి హీరోలు సోషల్ మీడియా వేదికగా నీరజ్కి, బజరంగ్ పూనియాలపై ప్రశంసలు కురిపించారు. పవన్ తన తరఫున, జనసేన తరఫున అభినందనలు తెలియజేశారు.
టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాకి పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ అభినందనలు తెలియజేశారు. ఇప్పటికే చిరు, వెంకీ, బాలయ్య, మహేష్,రాజమౌళి వంటి వారు అభినందనలు తెలిపారు. ఇప్పుడు పవన్, ప్రభాస్, రామ్ వంటి హీరోలు సోషల్ మీడియా వేదికగా నీరజ్కి, బజరంగ్ పూనియాలపై ప్రశంసలు కురిపించారు. పవన్ తన తరఫున, జనసేన తరఫున అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇందులో పవన్ చెబుతూ, `టోక్యో ఒలింపిక్స్ లో ఈటెను మేటిగా విసిరి స్వర్ణాన్ని ముద్దాడిన నీరజ్ చోప్రాని చూసి యావత్ భారతావని గర్విస్తోంది. జావెలిన్ త్రోలో స్వర్ణం గెలుచుకున్న నీరజ్ చోప్రాకి నా తరఫున, జనసేన పక్షాన హృదయ పూర్వక అభినందనలు. ఒలింపిక్స్ వేదికపై బంగారు పతకాన్ని అందుకునే మధుర క్షణాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న భారతీయులకు ఎనలేని ఆనందాన్ని కలిగించారు. వందేళ్ల తర్వాత అథ్లెటిక్స్ లో బంగారు పతకం అందించి అందరి కలను నెరవేర్చారు నీరజ్ చోప్రా.
ఆర్మీలో సైనికాధికారిగా సేవలందిస్తున్న చోప్రాకి ఒలింపిక్స్ వేదికపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించి విజయ గీతికని వినిపించారు. ఆయన పట్టుదల, క్రీడా నైపుణ్యం ప్రశంసనీయం. జావెలిన్ త్రోలో ఫేవరేట్స్ గా నిలిచిన వారికి సైతం అధిగమించి విజేతగా నిలిచిన నీరజ్ చోప్రాలోని ఆత్మస్థైర్యం, గెలవాలనే తపన కచ్చితంగా క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తాయి.
రెజ్లింగ్లో కాంస్య పతకాన్ని అందించన బజరంగ్ పునియాకి శుభాభినందనలు తెలియజేస్తున్నా. సెమిస్లో ఓటమి ఎదురైనా ఏమాత్రం స్థైర్యం కోల్పోకుండా ఆడి తన నైపుణ్యాన్ని చాటారు. టోక్యో ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్, బాడ్మింటన్, బాక్సింగ్, రెజ్లింగ్, హాకీ, జావెలిన్ త్రోల్లో పతకాలు సాధించి యువతరానికి క్రీడల వైపు ఆసక్తి పెంచేలా చేశారు మన విజేతలు. ఇతర విభాగాల్లోనూ క్రీడాకారులు పోరాడిన విధానం ప్రశంసనీయం. ఈ ఒలింపిక్స్ లో దక్కిన పతకాల స్ఫూర్తితో ప్రభుత్వ క్రీడా విధానంలోనూ గుణాత్మకమైన మార్పు వస్తుందని ఆశిస్తున్నా` అని పవన్ తెలిపారు.
ప్రభాస్ మాట్లాడుతూ, `అపూర్వమైన విజయం ఇది. దేశం మొత్తానికి చారిత్రక క్షణం. ఒలింపిక్స్ లో భారతదేశానికి మొట్టమొదటి అథ్లెటిక్స్ స్వర్ణం సాధించినందుకు నీరజ్ చోప్రాకి అభినందనలు` అని తెలిపారు ప్రభాస్.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. గోల్డ్ సాధించి నీరజ్ చరిత్రని సృష్టించారని తెలిపారు. ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ స్పందిస్తూ, `భారతదేశానికి మొదటి గోల్డ్. నీరజ్ చోప్రాకి అభినందనలు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచి, ఇది సాధ్యమే అని నిరూపించిన మీకు ధన్యవాదాలు. ఇది ప్రారంభం మాత్రమే` అని రామ్ తెలిపారు.