పవన్ కన్ఫ్యూజ్ అవుతూ దర్శక నిర్మాతలను కష్టాల్లోకి లోకి నెట్టేస్తున్నారనిపిస్తుంది. ఆయన తికమక నిర్ణయాలతో కొందరి భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ముఖ్యంగా ముగ్గురు డైరెక్టర్స్ పవన్ రాజకీయాలకు బలికానున్నారనేది టాలీవుడ్ టాక్. 


రాజకీయంగా పవన్(Pawan Kalyan) పై ఉన్న ప్రధాన ఆరోపణ నిలకడలేని తత్త్వం. ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆయనకే తెలియదు. ఒక మాటపై నిలబడే తత్త్వం కాదు. పరిస్థితులను బట్టి పార్టీ సిద్ధాంతం మార్చేస్తూ ఉంటాడు. ఒకసారి పొగిడిన నాయకుడిని తర్వాత తిడతాడు, మళ్ళీ కొన్నాళ్ళకు ఆయనే భేష్ అంటారు. జనసేన పార్టీ స్థాపించి 9ఏళ్ళు అవుతున్నా వ్యవస్థీకృతంగా బలపడపోవడానికి ఇదే కారణం. ఆయన సినిమాల్లోకి రీ ఎంట్రీ కూడా అలాంటిదే. 2018లో ప్రజాసేవకే జీవితం ఇకపై సినిమాలు చేసేది లేదన్నారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత సినిమాలు చేస్తే తప్పేంటి మీరు వ్యాపారాలు చేసుకోవడం లేదా? అంటూ కమ్ బ్యాక్ ఇచ్చారు. 

నిజానికి పవన్ సినిమాలు మానేయాలని కానీ మళ్ళీ రాకూడదని కానీ ఎవరూ చెప్పలేదు. ఆ రెండు స్టేట్మెంట్స్ పవన్ కళ్యాణ్ ఇచ్చినవే. రాజకీయాలను పక్కన పెడితే సినిమాల పరంగానైనా ఖచ్చితంగా ఉన్నారంటే అదీ లేదు. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ తర్వాత చేసిన చిత్రాలు చూస్తే కేవలం డబ్బుల కోసమే అన్నట్లు సాగింది.... సాగుతుంది. సినిమాకు రూ. 50 కోట్లు ఫిక్స్ చేసుకున్న పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ తో సంబంధం లేకుండా త్వరగా పూర్తి చేసే వాళ్లకే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నాడు. వకీల్ సాబ్ తర్వాత హరి హర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ చేయాల్సి ఉండగా.. వాటిని పక్కన పెట్టి మూడు నాలుగు నెలల్లో భీమ్లా నాయక్ పూర్తి చేశాడు. 

పవన్ ప్రకటించిన చిత్రాల లైన్ అప్ చూస్తే వకీల్ సాబ్, హరి హర వీరమల్లు(Hari hara Veeramallu), భవదీయుడు భగత్ సింగ్, సురేందర్ రెడ్డితో ప్రకటించిన చిత్రాలు ఉన్నాయి. వీరమల్లు, భవదీయుడు చిత్రీకరణకు ఎక్కువ సమయం తీసుకుంటుందనే కారణంతో వాటిని పక్కన పెట్టి భీమ్లా నాయక్ చేశారు. ఇప్పుడు వినోదయ సిత్తం చేయడానికి సిద్ధమయ్యారు. అలాగే తేరి రీమేక్ చేస్తానని నిర్మాత డివివి దానయ్య వద్ద రూ. 10 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నట్లు సమాచారం. అక్టోబర్ నుండి బస్సు యాత్ర చేయనున్న పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్, తేరి రీమేక్ పక్కన పెట్టేశాడట. 

దీంతో దర్శకులు క్రిష్, హరీష్ శంకర్(Harish Shankar), తేరి రీమేక్ కి దర్శకత్వం వహించాల్సిన సుజీత్ భవిష్యత్ గందరగోళంలో పడింది. ఈ చిత్రాల స్క్రిప్ట్ కోసం ఏళ్ల తరబడి పని చేసిన వారి సమయం వృధా అయినట్లే. దర్శకుడు క్రిష్ పరిస్థితి మరింత దారుణం. పవన్ కి ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన నిర్మాత ఏఎం రత్నం హరి హర వీరమల్లుపై ఇప్పటికే భారీగా ఖర్చు చేశారు. మొత్తంగా పరిస్థితి చూస్తుంటే పవన్ రాజకీయాలకు ముగ్గురు దర్శకులు బలి అయ్యారన్నమాట వినిపిస్తుంది.