సారాంశం

ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు చివరి నిమిషంలో తనకు దక్కలేదని బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ వెల్లడించారు. 

ఢిల్లీ: ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు చివరి నిమిషంలో తనకు దక్కలేదని బాలీవుడ్ సీనియర్ నటుడు పరేష్ రావల్ వెల్లడించారు. లాబీయింగ్ చేయకపోవడమే అవార్డు దక్కకపోవడానికి కారణమని ఆయన అన్నారు. 1990ల ప్రారంభంలో జరిగిన ఓ సంఘటన తర్వాత తనకు కలిగిన అయోమయం, నిరాశ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు.

“1993లో లేదా 1994లో నేను మారిషస్‌లో షూటింగ్‌లో ఉన్నాను... ఉదయం 7:30 లేదా 8 గంటలకు ముఖేష్ భట్ నుంచి ఫోన్ వచ్చింది. ‘పరేష్, ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? లే, లే... ‘సర్’ సినిమాకు నీకు జాతీయ అవార్డు వస్తోంది’ అని ఆయన అన్నారు” అని పరేష్ రావల్ చెప్పారు.

ఆ తర్వాత వార్తలను అర్థం చేసుకుంటుండగా మరో ఫోన్ వచ్చింది - ఈసారి చిత్ర నిర్మాత కల్పనా లాజ్మీ నుంచి. ‘సర్దార్’ సినిమాకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వచ్చిందని ఆమె చెప్పారు. ఏం జరుగుతుందో ఇంకా అర్థం కాలేదు. కొంతమందికి ఫోన్ చేసి విషయం తెలుసుకున్నానని పరేష్ రావల్ అన్నారు. ‘సర్దార్’ కేతన్ మెహతా సినిమా. ఆ సినిమాకే అవార్డు వచ్చిందా అని కల్పనా లాజ్మీని అడిగాను. అవునని ఆమె ధ్రువీకరించారని నటుడు చెప్పారు. 

స్వర్గం కళ్లముందు కనిపించినట్లు అనిపించిందని బాలీవుడ్ నటుడు అన్నారు. కానీ ఢిల్లీకి వచ్చాక తనకు ఉత్తమ సహాయ నటుడి అవార్డు మాత్రమే వస్తుందని తెలిసింది - అది కూడా ‘సర్దార్’కు కాదు, ‘సర్’ సినిమాకు అని తెలిసిందని ఆయన చెప్పారు. స్పష్టత కోసం ఆయన చిత్ర నిర్మాత కేతన్ మెహతా, విమర్శకుడు ఖలీద్ మొహమ్మద్, దర్శకుడు శ్యామ్ బెనెగల్, రాజకీయ నాయకుడు టి. సుబ్బరామి రెడ్డిలతో మాట్లాడారు. ఎక్కడ తప్పు జరిగిందని ప్రశ్నించారు. 

ఆశ్చర్యకరంగా, కేతన్ మెహతాకు కూడా నిర్ణయం గురించి స్పష్టత లేదు. సుబ్బరామి రెడ్డి విషయం స్పష్టం చేస్తూ “నువ్వు లాబీయింగ్ చేయలేదు. అవతలి వారు బాగా లాబీయింగ్ చేశారు. మమ్ముట్టికి అవార్డు వచ్చింది” అని అన్నారని, దాంతో తాను షాక్ అయ్యానని పరేష్ రావల్ చెప్పారు. 1993లో సర్దార్ వల్లభాయ్ పటేల్ బయోపిక్ ‘సర్దార్’ విడుదలైంది. అందులో ఆయన టైటిల్ పాత్ర పోషించారు. 1994లో ఉత్తమ నటుడిగా మమ్ముట్టికి ‘విధేయన్’, ‘పొన్తన్ మాడ’ సినిమాలకు అవార్డు వచ్చింది. 

మళ్లీ అవార్డు గురించి పరేష్ రావల్ మాట్లాడుతూ “మోదీ ప్రభుత్వ హయాంలో నాకు అవార్డు రాలేదు, కానీ 2013లో వచ్చింది. ఈ అవార్డును నేను గౌరవిస్తాను. కానీ దీనికి సాంకేతికతలు ఉన్నాయి, ఎవరూ సినిమా పంపకపోతే అవార్డు రాదు. అయితే అవార్డుల్లో కుట్రలు, లాబీయింగ్ ఉంటాయి. ఆస్కార్‌లో కూడా అలాగే జరుగుతుంది. ఇక్కడ ఎందుకు జరగకూడదు?” అని ప్రశ్నించారు. 

తన సినిమాల్లోని నటన చూసి రాత్రి 11, 12 గంటలకు ఫోన్ చేసి అభినందించడమే తనకు అవార్డు కంటే గొప్పదని పరేష్ రావల్ అన్నారు. పరేష్ రావల్ తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. బావగారు బాగున్నారా, శంకర్ దాదా ఎంబిబిఎస్ లాంటి చిత్రాల్లో ఆయన నటించారు.