Tollywood: టాలీవుడ్ సమస్య తెలిసిపోయింది... కాపాడే ఏకైక మందు అదే!
టాలీవుడ్ సమస్య ఏమిటో అర్థమైపోయింది. మంచి చిత్రాలు మాత్రమే థియేటర్స్ లో ఆడతాయని తేలిపోయింది. ప్రేక్షకులు థియేటర్స్ కి దూరం చేస్తుంది ఓటీటీ కాదన్న స్పష్టత వచ్చింది.
గత ఆరు నెలలుగా టాలీవుడ్ గడ్డి పరిస్థితులను ఎదుర్కొంది. జులై నాటికి విడుదలైన చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవి చూశాయి. బంగార్రాజు, ఆర్ ఆర్ ఆర్, డీజే టిల్లు, సర్కారు వారి పాట, మేజర్ చిత్రాలు మాత్రమే మంచి వసూళ్లు రాబట్టాయి. లాభాలు కురిపించాయి. ఇక రాధే శ్యామ్, ఆచార్య, అంటే సుందరానికీ, పక్కా కమర్షియల్, థాంక్యూ, రామారావు ఆన్ డ్యూటీ, ది వారియర్... ఘోరంగా దెబ్బతిన్నాయి. వీటిలో కొన్ని చిత్రాలు కనీస వసూళ్లు అందుకోలేదు.
ఈ క్రమంలో టాలీవుడ్ నిర్మాతలు సందిగ్ధంలో పడ్డారు. ఆగస్టు 1 నుండి షూటింగ్స్ బంద్ కు పిలుపునిచ్చారు. కొన్ని చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకొని కూడా వసూళ్ల సాధించకపోవడానికి ఓటీటీనే ప్రధాన కారణం అంటూ తేల్చారు. పెరిగిన ధరలతో పాటు కేవలం నాలుగు వారాల్లో కొత్త చిత్రాలు ఓటీటీలో అందుబాటులో రావడం వలన ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి రావాలనే ఆలోచన వదిలేశారన్న అభిప్రాయానికి వచ్చారు. అయితే వాళ్ళ అంచనా, విశ్లేషణ కరెక్ట్ కాదని గత వారం విడుదలైన బింబిసార, సీతారామం చిత్రాలు నిరూపించాయి.
సినిమాలో విషయం ఉంటే థియేటర్స్ కి ప్రేక్షకులు క్యూ కడతారని నిరూపించారు. కనీస మార్కెట్ లేని కళ్యాణ్ రామ్, తెలుగులో అంతంత మాత్రం గుర్తింపు ఉన్న దుల్కర్ కూడా సూపర్ హిట్ నమోదు చేయగలరని నిరూపించారు. నిజానికి ఈ ఇద్దరు హీరోలతో పోల్చితే రవితేజ, నాని, రామ్, నాగ చైతన్య పెద్ద మార్కెట్, స్టార్డం కలిగి ఉన్నారు. కానీ వాళ్ళ సినిమాలు ఆడలేదు. కారణం ఒక్కటే బింబిసార, సీతారామం చిత్రాల కథ, కథనాలు, నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిన బింబిసార ఐదు రోజుల్లో ఆరు కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టింది. ఇక సీతారామం నేడు బ్రేక్ ఈవెన్ కానుంది. కాబట్టి సమస్య తెరకెక్కే చిత్రాల్లోనే ప్రేక్షకుల్లో, ఓటీటీ సంస్థల్లో కాదని తేలిపోయింది.