రామ్ అనంతపురం ఈవెంట్ లో రచ్చ చేసింది ఎన్టీఆర్ అభిమానులా?
రామ్ నటించిన వారియర్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అనంతపురంలో నిర్వహించారు. ఈ ఈవెంట్ లో కొంత రసాభాస చోటు చేసుకుంది. చివరికి వేదికపైకి రాళ్లు కూడా విసిరారు. దీంతో ఈవెంట్ హడావిడిగా ముగిసింది.
రామ్ లేటెస్ట్ మూవీ ది వారియర్. దర్శకుడు లింగుస్వామి తెరక్కించగా రామ్ పవర్ పోలీస్ రోల్ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో బైలింగాల చిత్రంగా విడుదల కానుంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా, ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నారు. ది వారియర్ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. కాగా జులై 14న ది వారియర్ (The Warriorr)మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.
దీనిలో భాగంగా జులై 1న అనంతపురంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోయపాటి శ్రీను అతిథిగా హాజరయ్యారు. అయితే ది వారియర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహణ కష్టమైంది. అక్కడకు వచ్చిన అభిమానులు అదుపు తప్పారు. స్టేజి పైకి దూసుకెళ్ళడం, సౌండ్ సిస్టమ్స్ కి అంతరాయం కలిగించడం చేశారు. ఓ దశలో వేదిక పైకి రాళ్లు కూడా విసిరారు. ఈ విషయాన్ని యాంకర్ గా ఉన్న శ్యామల స్వయంగా మైక్ లో చెప్పారు. ఈ రాళ్లు ఎవరికైనా తగిలితే ప్రమాదం, వేయకండి అంటూ హెచ్చరించారు.
వేదిక వద్ద జనాలను అదుపు చేయడానికి సరిపడా భద్రతా సిబ్బంది కూడా లేకపోవడం ఈ పరిస్థితికి కారణమైంది. దర్శకుడు బోయపాటి శ్రీనుతో పాటు రామ్ పొడిపొడిగా మాట్లాడి ముగించారు. ముఖ్యంగా రామ్ కనీసం ఐదు నిమిషాలు కూడా మాట్లాడలేదు. మీ దెబ్బకు అందరూ భయపడి పారిపోతున్నారంటూ మాటల్లో మాటగా అన్నారు.రాత్రి పది గంటలు కూడా కాకుండానే త్వరగా ముగించుకొని వెళ్లిపోయారు.
కాగా వేదిక ముందు బోయపాటి శ్రీను, రామ్ (Ram Pothineni)మాట్లాడేటప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నానా హంగామా చేశారు. వారు ఎన్టీఆర్ సీఎం అని రాసున్న బ్యానర్స్ ది వారియర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ప్రదర్శించారు. అలాగే ఎన్టీఆర్ సీఎం(NTR) అంటూ నినాదాలు చేశారు. బోయపాటి ఎంత వారిస్తున్నా వారు వినలేదు. ఇక బోయపాటి తన స్పీచ్ లో సీనియర్ ఎన్టీఆర్, బాలయ్య (Balakrishna)ప్రస్తావన మాత్రమే తీసుకొచ్చారు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ పేరు పలకలేదు. ఇది కూడా వాళ్ళ ఆగ్రహానికి కారణమైంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ది వారియర్ ట్రైలర్ లాంచ్ లో ఓ భయానక వాతావరణం కనిపించింది.