ఎన్టీఆర్ కు భారతరత్న అనేది మెయిన్ డిమాండ్.. ఘనంగా ఎన్టీఆర్ 101 జయంతి వేడుకలు..
ఎన్టీ రామారావు 101 జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో సెలబ్రిటీలు రామారావుకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలుగు భాషకి, తెలుగుకి గౌరవాన్ని తెచ్చిన నటుడు ఎన్టీఆర్. తెలుగు సినిమా కళ విస్తరించడంలో ఆయన పాత్ర చాలా పెద్దది. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ఎంతో ప్రభావితం చేశారు. సీఎంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, విప్లవాత్మక నిర్ణయాలతో రాష్ట్రాన్ని కొంత పుంతలు తొక్కించారు. ఎన్టీఆర్ 101 జయంతి నేడు. ఈసందర్భంగా ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించారు. ఫిల్మ్ నగర్ కల్చరర్ సెంటర్ (ఎఫ్.ఎన్.సి.సి) లో ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్ సైట్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి జరిగింది.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ జీవించి ఉండగా ఆయనకు వ్యక్తిగతంగా సేవలు అందించిన ఎన్టీఆర్ వ్యక్తిగత వైద్యులు డా సోమరాజు, డా బి. ఎన్. ప్రసాద్, డా డి ఎన్ కుమార్ లతో పాటు ఎన్టీఆర్ వ్యక్తిగత సహాయకులు పి.ఏ శివరామ్, వంటమనిషి బీరయ్య, సహాయ మేకప్ మెన్ అంజయ్య, డ్రైవర్ రమేష్, ఆఫీస్ అటెండెంట్ చంద్రశేఖర్ యాదవ్, ఎన్టీఆర్ అభిమానులు మన్నే సోమేశ్వర రావు, బొప్పన ప్రవీణ్, ఎన్టీఆర్ నఫీజ్, కొడాలి ప్రసాద్, ఈదర చంద్ర వాసులకు కమిటీ చైర్మన్ టి. డి. జనార్థన్ సారధ్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, తెలుగు దేశం నాయకులు కనుమూరి రామకృష్ణం రాజు (ఆర్ ఆర్ ఆర్), ప్రముఖ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు, మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ, ప్రముఖ నిర్మాత కె. ఎస్ రామారావు, పుండరీ కాంక్షయ్య గారి తనయులు అట్లూరి నాగేశ్వర రావు పాల్గొని ఎన్. టి. రామారావు గారితో తమకున్న అనుబంధాన్ని, సాన్నిహిత్యాన్ని, ఆయనలోని విశిష్ట లక్షణాలను గుర్తు చేస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా అంతా కలిసి కొత్త ప్రభుత్వం వచ్చాక ఎన్టీఆర్కి భారతరత్న పురస్కారం అందించేవిషయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. భారతరత్న ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు.
నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ, నాన్నగారి 101వ జయంతి కార్యక్రమానికి వచ్చిన సోదర సోదరీమణులందరికీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉంది. నాన్నగారు సినిమాల్లో అన్ని రకాల పాత్రలు పోషించి అశేష ప్రేక్షకాభిమానం పొందారు. రాముడు, కృష్ణుడు అయనే అనేంత పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయ్యారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. రైతులకు అండగా నిలబడ్డారు. కార్మిక, యువత, బీసీ వర్గాలకు చేయూతనిచ్చారు. తిరుమలలో ఉచిత అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. యుగ పురుషుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. 1982 డిసెంబర్ 9, 10 తేదీలలో తన అన్న బాలకృష్ణ, తన వివాహాలు తిరుపతి లో జరిగినప్పుడు.. నాన్న గారు రాలేక పోయారు. ఫోన్ లో మాతో మాట్లాడుతూ... 'ఐయాం సారీ.. మేము మీ పెళ్ళికి రాలేక పోయాం. ఇప్పుడు మీరే కాదు.. ఆరు కోట్ల మంది తెలుగు ప్రజలందరూ నా కుటుంబ సభ్యులే' అని చెప్పారంటూ ఆయన ఒకింత భావోద్వేగం తో ఆ సంఘటన మననం చేసుకొన్నారు.