లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార గతేడాది పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయ్యింది. అయితే ఇప్పుడు ఆమె సినిమాలకు గుడ్‌ బై చెప్పబోతుందట. ప్రస్తుతం ఈ వార్త హాట్‌ టాపిక్‌ అవుతుంది.

లేడీ సూపర్‌ స్టార్‌గా పేరు తెచ్చుకుంది నయనతార. గ్లామర్‌ తారగా సినిమా రంగంలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగింది నయనతార. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఇప్పుడు ఎవరికీ సాధ్యం కానీ హీరోలకు దీటుగా ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది నయనతార. ఓ వైపు మహిళా ప్రధాన చిత్రాలు, మరోవైపు కమర్షియల్‌ మూవీస్‌ చేస్తూ కెరీర్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. 

అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయికగా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక్కో సినిమాకి ఐదు నుంచి ఆరు కోట్ల వరకు అందుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇక ప్రస్తుతం నయనతార బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి షారూఖ్‌ ఖాన్‌తో `జవాన్‌` చిత్రంలో నటిస్తుంది. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇందులో విజయ్‌ సేతుపతి నెగటివ్‌ రోల్‌ చేస్తున్నట్టు సమాచారం. 

తమిళంలో `ఇరైవన్‌` చిత్రంలో నటిస్తుంది. ఈ రెండు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ మూవీస్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్నాక సినిమాలకు బ్రేక్‌ ఇవ్వాలనుకుంటుందట నయనతార. కొన్నాళ్లపాటు పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కే టైమ్‌కి కేటాయించాలనుకుంటుందట. ఆ మధ్య నయనతార, విఘ్నేష్‌ దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. సరోగసి ద్వారా పేరెంట్స్ గా మారారు ఈ జంట. అయితే పిల్లల బాగోగులకు సంబంధించి నయనతార స్వయంగా చూసుకోవాలనుకుంటుందట. అందుకే సినిమాలకు గ్యాప్‌ ఇవ్వాలనుకుంటుందని సమాచారం. మరి బ్రేక్‌ మాత్రమేనా, పూర్తిగా సినిమాలకు దూరమవుతుందా? అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది.

నిజానికి పెళ్లి చేసుకున్న సమయంలో నయనతార సినిమాలకు గుడ్‌ బై చెప్పబోతుందనే వార్తలొచ్చాయి. కానీ అందులో నిజం లేదని ఆ వెంటనే తేలిపోయింది. కానీ ఇప్పుడు మరోసారి ఈ వార్తలు తెరపైకి రావడం ఆశ్చర్యపరుస్తుంది. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. నయనతార చివరగా `గాడ్‌ ఫాదర్‌` చిత్రంలో చిరుకి చెల్లిగా నటించిన విషయం తెలిసిందే.