సారాంశం

సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి యాభై ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఆయన ఎమోషనల్‌ అయ్యారు. జీవితాంతం నటుడిగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. 

సీనియర్‌ నటుడు మురళీమోహన్‌ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నారు. మార్చి నెలతో ఐదు దశాబ్దాల సినీ జర్నీ కంప్లీట్‌ చేసుకున్న మురళీ మోహన్‌ ఆ జర్నీని గుర్తు చేసుకున్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితాంతం సినిమా రంగంలోనే ఉంటానని, నటుడిగానే కొనసాగుతానని వెల్లడించారు. మరోవైపు రేపు `మదర్స్ డే` సందర్భంగా `అమ్మే దైవం` అనే పాటని విడుదల చేశారు మురళీ మోహన్‌. 

మురళీ మోహన్‌ తన సినిమా జర్నీ గురించి మాట్లాడుతూ ముందుగా తనని హీరోగా పరిచయం చేసిన మేకర్స్ అట్లూరి పూర్ణచంద్రరావు, పీవీ సుబ్బారావులకు ఆయన మొదట ధన్యవాదాలు తెలియజేశారు. ఇంకా చెబుతూ, నా జీవితంలో ఎప్పుడూ ఇన్నేళ్ల సినిమా ప్రయాణం ఉంటుందని ఊహించలేదు. మొదటిసారి సినిమాల్లోకి వచ్చినప్పుడు నాకు 33ఏళ్ళు. ఏదో ఒక  15ఏళ్ళు ఉంటానేమో అనుకున్నా. కానీ అదృష్టం కలిసిరావడం, అందరూ సహకరించడంతో ఇన్నేళ్లు కొనసాగే అవకాశం దక్కింది.

నేను అనుకోకుండా సినిమా యాక్టర్‌ అయ్యాను. మొదటి నుంచి నాకు బిజినెస్‌ మీద ఎక్కువగా ఇంట్రస్ట్‌ ఉండేది. మధ్యలో అనుకోకుండా, తప్పనిసరి పరిస్థితుల్లో  రాజకీయాల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. దాంతో పదేళ్ళు సినిమాలకు బ్రేక్‌ వచ్చింది. వ్యాపారం కూడా నా కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారు. ప్రస్తుతం అవన్నీ పూర్తిగా వదిలేసి కంప్లీట్‌గా సినిమాలకు అంకితం అవ్వాలనుకుంటున్నా. నేను అక్కినేని నాగేశ్వరరావు అభిమానిని ఆయన సినిమాలు ఎక్కువగా చూస్తూ ఉండేవాడిని. `నేను చనిపోయేంతవరకు కూడా సినిమాల్లో నటిస్తూ ఉంటాను` అన్నారు. అలాగే ఆయన మాట నిలబెట్టుకున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించినప్పటికీ చివరగా ఆయన `మనం` చిత్రంలో నటించారు. నాగేశ్వరరావుగారే నా స్ఫూర్తి. నేను కూడా ఆయన లాగే ఇక నటనకే అంకితం అవుతాను` అని తెలిపారు.  

సినిమా జర్నలిస్టుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మురళీ మోహన్‌, మన తెలుగు జర్నలిస్టులను చూసి నేను చాలా ఆనందపడుతుంటాను. ఎందుకంటే ఇతర భాష జర్నలిస్టుల్లా ఎల్లో జర్నలిజం ఉండదు. ఇక్కడ అందరూ కూడా ప్రతి ఒక్క హీరో గురించి ఆర్టిస్టు గురించి ఎక్కువగా పాజిటివ్‌గా మాత్రమే రాస్తారు. వేరే భాషా జర్నలిజంలో ఎక్కువ శాతం నెగిటివ్‌నెస్‌ తప్ప పాజిటివ్‌ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ మన తెలుగు జర్నలిజం గురించి చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుంది` అని తెలిపారు.

మదర్స్ డే పాట రిలీజ్‌ చేస్తూ, `రేపు మే14న `మదర్స్‌ డే` సందర్భంగా `మిథునం` చిత్రం  మ్యూజిక్‌ డైరెక్టర్‌ వీణపాణి మదర్స్ పై ఓ పాటని రచించారు. దీన్ని మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని నన్ను అడిగారు. అయితే ఆ పాటతో పాటూ  మన హీరోలందరి తల్లుల   ఫొటోలను వేసి ఒక చిన్న వీడియో రూపంలో విడుదల చేద్దామని చెప్పా. రత్నాల్లాంటి బిడ్డలను కళామతల్లికి అందించిన ఆ రత్న గర్భాల గురించి కూడా తెలుసుకుందామని చెప్పాను. దాంతో ఆయన సరే అని అన్నారు. చాలా శ్రమపడి అందరి ఫొటోలను సేకరించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఈ వీడియో కూడా బాగా వచ్చింది. `అమ్మే దైవం` అనే పాటను విడుదల చేయడం ఆనందంగా ఉంది` అని అన్నారు మురళీ మోహన్‌.