Mohanbabu: వివాదంలో మోహన్బాబు.. షిర్డీ సాయినాథుడిపై సంచలన వ్యాఖ్యలు.. దుమారం..
మోహన్బాబు వివాదంలో ఇరుక్కున్నారు. షిర్డీ సాయినాథుడి దేవాలయంపై ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. వివాదంగా మారుతున్నాయి.
విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్బాబు(Mohanbabu) తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. ఆయన షిర్డి సాయిబాబా(Shirdi Sai Baba Temple) టెంపుల్పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. భక్తుల అసంతృప్తికి కారణమవడంతోపాటు వివాదంగా మారుతున్నాయి. దీంతో మోహన్బాబు వ్యాఖ్యలపై భక్తులు మండిపడుతున్నారు. మరి ఇంతకి మోహన్బాబు ఏం మాట్లాడారు? భక్తులు ఎందుకు హార్ట్ అయ్యారనేది చూస్తే..
తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం, రంగంపేటలో పెద్ద సాయిబాబా గుడిని నిర్మించారు మోహన్బాబు. ఇది దక్షిణాదిలోనే అతిపెద్ద టెంపుల్ కావడం విశేషం. మంగళవారం ఈ గుడిలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోహన్బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్బాబు మాట్లాడుతూ, ఈ గుడి దక్షిణాదిలోనే అతి పెద్ద సాయిబాబా దేవాలయమని తెలిపారు. ఇదొక అద్భుతంగా వర్ణించారాయన. తన దృష్టిలో ఇక భక్తులు షిర్డీ సాయినాథుని ఆలయానికి వెళ్లనక్కర్లేదని వ్యాఖ్యానించారు. ఇదే ఇప్పుడు భక్తుల మనోభావాలను దెబ్బ తీసినట్టయ్యింది.
దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మోహన్బాబుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు భక్తులు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. తాను నిర్మించిన టెంపుల్ ఆదరణ కోసం ఎన్నో ఏళ్లుగా భక్తుల ఇష్టదైవంగా నిలిచిన షిర్డీ సాయినాథుడి టెంపుల్ కి వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన ఎలా అంటారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు మోహన్బాబు వ్యాఖ్యలు వివాదంగా మారాయి. మరి ఈ వివాదంపై మోహన్బాబు స్పందిస్తారా? లేదా అనేదిచూడాలి.
ఇదిలా ఉంటే రంగంపేటలోని సాయిబాబా ఆలయ విగ్రహ ప్రతిష్ట సందర్బంగా మోహన్బాబు ఇంకా మాట్లాడుతూ, ఈ గుడిని నిర్మించాలనుకున్నప్పుడు మంచు విష్ణు ఓ మాట అన్నాడు. వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చిన భక్తులంతా ఈ గుడికి రావాలి. అలా కడితే కట్టండి లేకపోతే లేదు అని, తాను అలానే కట్టానని భావిస్తున్నట్టు చెప్పారు మోహన్బాబు. ఈ కట్టడం చాలా అద్భుతమన్నారు. రుషికేష్ నుంచి దాదాపు 110 సంవత్సరాలకు పైనున్న యోగి సహా యోగులు, రుషీశ్వరుల నుంచి చెక్కలు, అమూల్యమైన మూలికలు తీసుకొచ్చి ఆలయంలో పెట్టినట్టు తెలిపారు.
ఇదంతా తన ఒక్కడి కోసం కాదని, విద్యాలయం, పక్క గ్రామాలు, రెండు తెలుగు రాష్ట్రాలు, యావత్ భారతదేశం నెంబర్ వన్గా ఉండాలన్నదే తన కోరిక అని చెప్పారు. అందరూ క్షేమంగా ఉండాలని ఈ రోజు ఈ గుడిని ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచు విష్ణు, మంచు మనోజ్, లక్ష్మీ ప్రసన్న, మంచు ఫ్యామిలీ మొత్తం పాల్గొంది. దీంతో అభిమానులు భారీగా తరలివచ్చారు.