సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ కలిసి నటించిన `విరూపాక్ష` సినిమా పాజిటివ్ నోట్ తో ప్రారంభమయ్యింది. కానీ ఈ సినిమాని మూడు ప్రధానమైన అంశాలు దెబ్బకొడుతున్నాయి.
సాయిధరమ్ తేజ్ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన `విరూపాక్ష` చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఈ సినిమాకి సంబంధించి మొదటి రోజు కలెక్షన్లు సాయిధరమ్ తేజ్ కెరీర్లోనే అత్యధికం కావడం విశేషం. ఆరున్నకోట్ల నెట్ సాధించిన ఈ చిత్రం పాజిటివ్ నోట్తో ప్రారంభమయ్యింది. అప్కమింగ్ డైరెక్టర్ కార్తీక్ దండు టేకింగ్కి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. సంయుక్త మీనన్ ఈ సినిమాని తన భుజాలపై నడిపించి సాయిధరమ్ తేజ్కి హిట్ ఇచ్చింది. ఆమె పాత్రనే సినిమాని నిలబెట్టిందనేది నిజం. దీనికితోడు ఆమె గోల్డెన్ లెగ్ సెంటిమెంట్ ఈ సినిమాకి పనిచేయడంతో సాయి బిగ్ కమ్ బ్యాక్ అవుతున్నాడని చెప్పొచ్చు.
థ్రిల్లర్ సినిమా కావడంతో దీన్ని చూసే ఆడియెన్స్ లిమిటెడ్. ఈ సినిమా ఎంత చేసిన శని, ఆదివారాల్లోనే కలెక్షన్లు రాబట్టాలి. లేదంటే వెనకబడి పోతుంది. రూ.25కోట్ల థియేట్రికల్ రైట్స్ టార్గెట్ తో ముందుకు సాగుతున్న ఈ సినిమా దాన్ని రీచ్ కావడంలో వెనకబడి పోతుంది. మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు కలెక్షన్లు బెటర్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఏ మేరకు రీచ్ అవుతుందో చూడాలి. నిజానికి ఈ చిత్రం పెద్ద రేంజ్ హిట్ కావాల్సింది. ఈ కలెక్షన్లు చూస్తుంటే ఆ రేంజ్ కి వెళ్లేలా కనిపించడం లేదు. అయితే ప్రధానంగా మూడు అంశాలు ఈ సినిమాని దెబ్బకొడుతున్నాయి. ఎక్కువగా రీచ్ లేకుండా చేస్తున్నాయి.
అందులో మొదటిది కథ. సినిమా స్టోరీ రొటీన్. ఎప్పుడో ఇలాంటి కథలను చూసేశాం. కొత్తగా లేకపోవడం మైనస్. దీనికితోడు ఇందులో ఎమోషన్స్ క్యారీ కాలేదు. దీంతో ఈ సినిమా పెద్దగా కనెక్ట్ కాదు. లవ్ ట్రాక్ సైతం చిరాకు తెప్పించేలా ఉంటుంది. కానీ దర్శకుడు కార్తీక్ దండు టేకింగ్ ఈ సినిమాకి ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు. అయితే ప్రచారం జరుగుతున్నట్టు ఇదేం గొప్ప చిత్రం కాదు, ప్రచారం చేస్తున్నంత అద్భుతంగానూ లేదు. జస్ట్ యావరేజ్ మూవీ. పోటీకి పెద్దగా సినిమాలు లేకపోవడంతో దీనికి కలిసొచ్చింది.
ఇక రెండో మైనస్ టికెట్ రేట్లు.. `విరూపాక్ష` థ్రిల్లర్ మూవీ. దీనికి ప్రధానంగా వచ్చేది మల్టీఫ్లెక్స్ ఆడియెన్స్. అయితే నిర్మాతలు అత్యుత్సాహం ప్రదర్శించి మల్టీప్లెక్స్ ల్లో టికెట్ రేట్లు రూ.295గా నిర్ణయించారు. ఇదే ఇప్పుడు సినిమాకి పెద్ద మైనస్గా మారుతుంది. ఆడియెన్స్ రిపీటేషన్ని అడ్డుకుంటుంది. 200 టికెట్ రేట్లు ఉంటే రిపీట్ ఆడియెన్స్ ఉండేవారు. సోషల్ మీడియాలో చాలా మంది ఆడియెన్స్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. టికెట్ రేట్ కారణంగానే ఈసినిమాని మళ్లీ చూడలేకపోతున్నామని, దీంతో వేరే సినిమాకి వెళ్లాల్సి వస్తుందని పోస్ట్ లు పెడుతున్నారు. అలా నిర్మాతల కక్కుర్తినే ఈ సినిమాకి మైనస్గా మారడం గమనార్హం.
మూడో మైనస్ సాయిధరమ్ తేజ్. నిజానికి ఇందులో హీరో పాత్రకి పెద్దగా ప్రయారిటీ లేదు. పైగా సాయిధరమ్ పాత్ర చేసింది కూడా పెద్దగా ఏం లేదు. కథలో ఆయన పాత్రని బలవంతంగా పెట్టినట్టుగానే ఉంటుంది కానీ ఆ పాత్రలో బలం లేదు. హీరోయిన్ పాత్ర ప్రధానంగా సాగే కథ ఇది. సాయిధరమ్ తేజ్కి కావాలని సీన్లు పెంచారు. ఆయన ఎలివేషన్ కోసం ప్రయత్నించే క్రమంలో హీరోయిన్ సంయుక్త మీనన్ పాత్రని తగ్గించేశారనేది స్పష్టంగా కనిపిస్తుంది. పైగా ఇందులో సాయి ధరమ్ తేజ్ బాడీలో ఈజ్ లేకపోవడంతో ఆ లోటుని ఆడియెన్స్ ఫీలవుతారు. సాయి స్థానంలో వేరే హీరో ఉంటే సినిమా ఇంకో రేంజ్లో ఉండేదనే టాక్ కూడా వినిపిస్తుంది.
సాయిధరమ్ తేజ్ ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకోక ముందే షూటింగ్ చేశారని ఆయన యాక్టింగ్ చూస్తుంటే అర్థమవుతుంది. చాలా సీన్లలో ఆయన నిస్సాహయతగా కనిపిస్తారు. బాడీ మూమెంట్స్ సరిగా లేవు. దీంతో ఆ తేడా థియేటర్లలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది సాయి ఫ్యాన్స్ ని సైతం అసంతృప్తికి గురి చేస్తుంది. కానీ జరిగిన ప్రమాదం అలాంటిది కాబట్టి దాన్ని ఎవరూ తప్పుపట్టలేరు. ఆ మాత్రం చేయడమే గొప్పగా భావిస్తున్నారు. ఫ్యాన్స్ అర్థం చేసుకుంటారు? కానీ కామన్ ఆడియెన్స్ ఎందుకు అర్థం చేసుకోవాలనేది ప్రశ్న. ఎందుకంటే భారీగా టికెట్ రేట్లు పెంచి బాదుతున్నారు. ఇందులో మేకర్స్ కాసుల కక్కుర్తే గానీ ఆడియెన్స్ పై సింపతి ఎక్కడుంది?.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి బలం కూడా సాయిధరమ్ తేజ్నే. ఎందుకంటే ఆయన ప్రమాదానికి సంబంధించిన సింపతే ఈ చిత్రాన్ని నిలబెట్టింది. ఆ సింపతి కారణంగానే ఈ సినిమాకి నెగటివ్ టాక్ స్ప్రెడ్ కాలేదు. దీనికితోడు ఓవర్ డోస్ పాజిటివ్ టాక్ బయటకు వెళ్లింది. ప్రధాన మీడియా సైతం రకరకాల ఈక్వేషన్లతో ఈ సినిమాని మోస్తుండటం గమనార్హం. అలా ఈ సినిమా సక్సెస్ దిశగా అడుగులు వేస్తుంది. లేదంటే రిజల్ట్ తేడా కొట్టేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 45కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా థియేట్రికల్ రైట్స్, డిజిటల్స్ రైట్స్ భారీగా అమ్ముడు పోవడంతో నిర్మాతలు మాత్రం టేబుల్ ప్రాఫిట్లో ఉన్నారని టాక్.
