తొలిసారిగా ఫ్యాన్స్ కోసం స్టేజ్ పై మహేశ్ బాబు మాస్ స్టెప్పులు.. అభిమానుల అరుపులతో దద్దరిల్లిన కర్నూల్
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)కు అభిమానులంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ సినిమా ఫంక్షనైనా వారి గురించి ప్రత్యేకంగా మాట్లాడకుండా ఉండలేరు. అయితే సర్కారు వారి పాట మాస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ లో ఫ్యాన్స్ కోసం తొలిసారిగా స్టైజ్ పై డాన్స్ చేశారు.
దర్శకుడు పరుశురాం పెట్ల, సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata).రెండేండ్ల తర్వాత మహేశ్ బాబు ఈ మాస్ ఎంటర్ రైనర్ తో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మే 12 రిలీజ్ అయిన ఈ చిత్రం నెగెటివ్ టాక్ ను దాటుకొని బ్లాక్ బాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఏపీలోని కర్నూల్ లో ఎస్ టి బి సి కాలేజ్ గ్రౌండ్స్ లో ఈరోజు ‘సర్కారు వారి పాట మాస్ సెలబ్రేషన్స్’ గ్రాండ్ గా నిర్వహించారు. సెలబ్రేషన్స్ కు మహేశ్ బాబు, దర్శకుడు పరుశురాం, థమన్, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, చిత్ర యూనిట్ హాజరైంది.
అయితే రెండు రోజుల వ్యవధిలో కర్నూల్ లో గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ ను ఏర్పాటు చేసినప్పటికీ ఈవెంట్ కు కాలేజీ గ్రౌండ్ నిండా అభిమానులు చేరుకున్నారు. ‘ఒక్కడు’ సినిమా తర్వాత మహేశ్ బాబు తొలిసారిగా కర్నూల్ కు చేరుకోవడంతో ఈవెంట్ కు ఫ్యాన్స్ పోటెత్తారు. అంతమంది అభిమానులను చూసిన మహేశ్ బాబు కూడా చాలా ఎనర్జిని ఫీలయ్యారు. ఈ సందర్భంగా వారి కోసం తొలిసారి ఎవరూ పిలవకుండానే స్టేజ్ పైకి వెళ్లి డాన్స్ చేశారు. ‘మహేశా’ సాంగ్ కు థమన్ తో కలిసి మాస్ స్టెప్పులేశారు. దీంతో అభిమానుల అరుపులకు స్టేజ్, గ్రౌండ్.. ఒకరకంగా చెప్పాలంటే కర్నూల్ నగరం దద్దరిల్లింది. ఎవరూ ఊహించని విధంగా మహేశ్ స్టెప్పులేయడం ఈవెంట్ కే హైలెట్ గా నిలిచిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఆ తర్వాత అభిమానులను ఉద్దేశించి మహేశ్ బాబు మాట్లాడారు. ‘కర్నూల్ కు ‘ఒక్కడు’ సినిమా తర్వాత మళ్లీ ఇప్పుడే వచ్చాను. మీరు ఇంత పెద్ద సంఖ్యలో సక్సెస్ ఈవెంట్ కు వస్తారని ఊహించలేదు. మీ అందరినీ చూస్తుంటే సినిమా 100 రోజుల ఫంక్షన్ జరుగుతున్నట్టు అనిపిస్తోంది. మళ్లీ ఇలాంటి ఈవెంట్ ఉంటే రాయలసీమాలోనే జరగాలని ఆశిస్తున్నాను. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మీ ఆదరాభిమానులు నాతో ఉంటున్నాయి. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియకా.. ఎప్పుడూ డాన్స్ చేయని నేను.. ఈ సారి స్టేజ్ పై స్టెప్పులేశాను. మీకోసం మరిన్ని మంచి సినిమాలు, మీకు నచ్చే సినిమాలు చేస్తాను’ అని ఫ్యాన్స్ గురించి ఎమోషనల్ గా మాట్లాడారు.
బ్యాకింక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేశ్ బాబు, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందివ్వగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. శాటిలైట్ హక్కులను స్టార్ మా దక్కించుకుంది. చిత్రంలో వెన్నెల కిశోర్, విలన్ పాత్రలో సముద్రఖని నటించారు.