చిరు ఫైర్.. నటి హేమకు షాక్..`మా` షోకాజ్ నోటీసులు..
ఇటీవల `మా`లో అవకతవకలు జరిగాయని నటి హేమ ఓ ఆడియో విడుదల చేసింది. మంగళవారం `మా` క్రమశిక్షణ సంఘం నుంచి నటి హేమకి నోటీసులు జారీ చేశారు.
`మా`(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల వివాదం రోజుకో టర్న్ తీసుకుంటుంది. ఇంకా నిత్యం ట్విస్ట్స్ అండ్ టర్న్ లతో రసవత్తరంగా సాగుతుంది. ఇటీవల `మా`లో అవకతవకలు జరిగాయని నటి హేమ ఓ ఆడియో విడుదల చేసింది. ఎన్నికలు జరగనివ్వకుండా, తాను అధ్యక్షుడిగా కొనసాగాలని నరేష్ ప్రయత్నిస్తున్నారని దాదాపు `మా` సభ్యుల్లోని 250 మందికి ఆమె ఈ ఆడియో పంపినట్టు తెలుస్తుంది.
అంతేకాకుండా ప్రస్తుత ప్యానల్ ఒక్క రూపాయి కూడా సంపాదించకుండా, ఉన్నదంతా ఖర్చు పెడుతూ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన ఆడియో టేప్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. 'మా' ఎన్నికలు జరపాలంటూ హేమ సంతకాల సేకరణ ప్రారంభించారు. దీనికి కౌంటర్ సోమవారం `మా` అధ్యక్షుడు నరేష్, జీవితలు స్పందించి వివరణ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి దీనిపై రియాక్ట్ అయ్యారు. బహిరంగ ప్రకటనలు చేస్తూ `మా` ప్రతిష్టని మసకబారుస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఆయన క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకి లేఖ రాశారు. దీంతో దీని పర్యావసానాలు వెంటనే స్టార్ట్ అయ్యారు. మంగళవారం `మా` క్రమశిక్షణ సంఘం నుంచి నటి హేమకి నోటీసులు జారీ చేశారు. `మా` ప్రస్తుత అధ్యక్షడు నరేష్పై చేసిన ఆరోపణలకు వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
2021-23కిగానూ జరిగే ఎన్నికల్లో `మా` అధ్యక్ష బరిలో నటి హేమ ఉన్న విషయం తెలిసిందే. ఆమెతోపాటు ప్రకాష్రాజ్, మంచు విష్ణు, జీవిత, సీవీఎల్ నర్సింహరావులున్నారు. ప్రకాష్ ఏకంగా తన ప్యానెల్ కూడా ప్రకటించారు. మరోవైపు మంచు విష్ణు `మా` బిల్డింగ్ కోసం తన సొంత డబ్బులిస్తానని, పెద్దలు ఏకగ్రీవంగా ఒకరిని ఎంపిక చేస్తే తాను తప్పుకుంటానని తెలిపారు.