తన ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలు కోర్ట్ కి సమర్పించిన విశాల్..
హీరో విశాల్, లైకా ప్రొడక్షన్స్ కి సంబంధించిన కేసు చెన్నై కోర్ట్ లో విచారణ జరుగుతుంది. ఈ సందర్బంగా విశాల్ తన ఆస్తులను కోర్ట్ కి సమర్పించారు.

హీరో విశాల్ ఇటీవల `మార్క్ ఆంటోని` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. విశాల్ గత చిత్రాలతో పోల్చితే మంచి ఫలితాన్నే సాధించింది. ఓ రకంగా కొంత ఊపిరిపీల్చుకున్నాడని చెప్పొచ్చు. అయితే విశాల్ కోర్ట్ కేసు ఎదుర్కోవల్సి వచ్చింది. ఆయన ఏకంగా తన ఆస్తులను, బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలను కోర్ట్ కి సమర్పించడం చర్చనీయాంశంగా మారింది. మరి ఆ కేసేంటి? ఏం జరిగిందనేది చూస్తే,
హీరో విశాల్ చాలా వరకు తన సినిమాలను ఆయనే నిర్మిస్తుంటారు. ఈ క్రమంలో ఫైనాన్షియర్ అన్బచెలియన్ వద్ద ఆయన సుమారు 21.29కోట్లు ఫైనాన్స్ తీసుకున్నాడు. తాను కట్టలేని స్థితిలో ఆ అమౌంట్ని లైకా సంస్థ చెల్లించింది. అందుకుగానూ విశాల్ నిర్మించే సినిమాల హక్కులను తమకి చెందే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇటీవల విశాల్ హీరోగా నటించి, నిర్మించిన `వీరమే వాగై చుడుమ్` చిత్ర హక్కులను లైకాకి కాకుండా వేరే సంస్థకి విక్రయించారు. దీంతో లైకా ప్రొడక్షన్ సంస్త చెన్నై హైకోర్ట్ ని ఆశ్రయించింది.
ఈ కేసుకి సంబంధించిన విచారణ చెన్నై హైకోర్ట్ లోని ప్రత్యేక న్యాయస్థానంలో జరిగింది. గత 12న ఈ కేసుని విచారించిన న్యాయమూర్తి పీటీ ఉషా.. విశాల్ తన స్థిరాస్తులు, బ్యాంక్ ఖాతాల వివరాలను కోర్ట్ కి సమర్పించాలని ఆదేశించింది. కానీ విశాల్ వాటిని పట్టించుకోలేదు. దీంతో ఈ నెల 19న జరిగిన విచారణలో కోర్ట్ దీన్ని కోర్ట్ ధిక్కరణ కిందకి పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. సోమవారం మరోసారి విచారణ జరిపింది.
ఇందులో విశాల్ తన ఆస్తుల వివరాలను కోర్ట్ కి అందించారు. స్టాండర్డ్ చార్టెడ్, ఐడీబీఐ, యాక్సెస్, హెచ్డీ ఎఫ్సీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాల వివరాలను సైతం సమర్పించారు విశాల్. కానీ ఇందులో పూర్తి వివరాలు లేకపోవడంతో రిట్ పిటిషన్ దాఖలు చేయల్సిందిగాలైకాని కోర్ట్ ఆదేశించింది. తదుపరి విచారణ నేడు జరుగుతుంది. ఇక `మార్క్ ఆంటోనీ`తో సక్సెస్ అందుకున్న విశాల్ ఇప్పుడు `తుప్పరివాలన్ 2`లో నటిస్తున్నారు. దీంతోపాటు మరో సినిమాకి కమిట్ అయ్యారు విశాల్.