సామాజిక సందేశాన్ని, కమర్షియల్ అంశాలను మేళవించి సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటున్న దర్శకుడు కొరటాల శివ.. నెక్ట్స్ పవన్ కళ్యాణ్తోనూ ఓ సినిమా చేయబోతున్నారు. తాజాగా ఆ విషయాన్ని వెల్లడించారు.
దర్శకుడు కొరటాల శివ(Koratala Siva) సందేశాన్ని, కమర్షియలిటీని మేళవించి సినిమాలు చేయడంలో దిట్ట. నిజానికి ఈ విషయంలో ఆయన ఓ ట్రెండ్ సెట్టర్. అంతర్లీనంగా మంచి సందేశాన్ని ఇస్తూనే, కమర్షియల్ మీటర్ ఏమాత్రం తగ్గకుండా సినిమాని వెండితెరపై ఆవిష్కరిస్తూ హిట్ కొట్టడం ఆయన స్పెషాలిటీ. నేటి తరం దర్శకుల్లో అరుదైన డైరెక్టర్ కొరటాల. తాను నమ్మిన సిద్ధాంతాన్ని, తాను పెరిగిన పరిస్థితుల్లో చూసిన ఎన్నో సామాజిక అంశాలను ఆయన సినిమా రూపంలో చెబుతూ, జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మార్పులో భాగమవుతున్నారు.
మరోవైపు జనసేన పేరుతో అన్యాయంపై పోరాడుతున్నారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). సామాజిక న్యాయం కోసం ఆయన తనవంతు కృషి చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే, అది అద్భుతంగా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అన్ని కుదిరితే త్వరలోనే ఈ సినిమా తెరపైకి రాబోతుందని అంటున్నారు దర్శకుడు కొరటాల శివ. తాజాగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. పవన్ కళ్యాణ్తో సినిమా చేయడానికి తాను సిద్ధమే అని, ఆయన కోసమే ఓ కథని సిద్ధం చేసి పెట్టానని తెలిపారు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో కొరటాల శివ రూపొందించిన `ఆచార్య`(Acharya) చిత్రం రేపు(ఏప్రిల్ 29)శుక్రవారం విడుదల కాబోతుంది. రామ్చరణ్ కీలక పాత్రలో నటించిన ఈచిత్రంలో ఆయనకు జోడీగా పూజా హెగ్డే కనిపించబోతుంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్రెడ్డి నిర్మించారు. చిత్రం ప్రమోషన్లో భాగంగా కొరటాల శివ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నెక్ట్స్ ఆయన ఎన్టీఆర్తో చేయబోతున్న విషయం తెలిసిందే. `ఎన్టీఆర్ 30` అనే వర్కింగ్ టైటిల్తో ఈ చిత్రం రూపొందనుంది.
`పొలిటికల్ నేపథ్యంలో ఉంటుందని అంతా అనుకుంటున్నారు. అది నిజం కాదు. నా కెరియర్లో ఇప్పటి వరకు రాయని పరిధిలో తారక్తో చేసే సినిమా కథ ఉంటుంది. చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి` అని చెప్పారు. `ఆచార్య` రిలీజ్ హడావుడి పూర్తయిన తర్వాత కొన్ని రోజులు వెకేషన్కి వెళ్లి ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమాని ప్రారంభించబోతున్నట్టు చెప్పారు.
ఎన్టీఆర్ సినిమాతోపాటు కొరటాల నెక్ట్స్ చిత్రాల లైనప్ మామూలుగా లేదు. ఆయన అల్లు అర్జున్తో ఓ సినిమా చేయాల్సి ఉంది. `పుష్ప 2` తర్వాత ఈ సినిమా ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. మరోవైపు ప్రభాస్తోనూ ఓ సినిమా చేయాల్సి ఉందన్నారు కొరటాల. అలాగే మహేష్తోనూ సినిమా అనుకున్నట్టు చెప్పారు. `మహేష్బాబునే చాలా గ్యాప్ వచ్చింది, మనం సినిమాచేయాల`ని అడిగినట్టు కొరటాల చెప్పారు. అలాగే రామ్చరణ్తోనూ ఓ సినిమా చేయాల్సి ఉందని చెప్పారు. మరోవైపు పవన్తోనూ ఓ కథ సిద్ధంగా ఉందని చెప్పడం విశేషం. ఇలా బ్యాక్ టూ బ్యాక్ ఐదు భారీ చిత్రాలు కొరటాల లైనప్లో ఉండటం విశేషం.
