నవీన్ పొలిశెట్టికి బెస్ట్ యాక్టర్ అవార్డు.. వాచ్మెన్ అందుకున్న వైనం.. ఇది కూడా కామెడీయేనా?
నవీన్ హీరోగా తెలుగు నటించిన మొదటి సినిమా `ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ`. ఈ చిత్రానికిగానూ నవీన్కి `దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్` బెస్ట్ యాక్టర్ అవార్డు వరించింది.
నవీన్ పొలిశెట్టి ఇటీవల `జాతిరత్నాలు` సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుని క్రేజీ హీరోగా మారిపోయాడు. ఈ సినిమా యాభై కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది. ఇందులో నవీన్, రాహుల్ రవీంద్రన్, ప్రియదర్శి చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. అందుకే ఆడియెన్స్ కరోనాని లెక్క చేయకుండా బ్రహ్మారథం పట్టారు. ఇదిలా ఉంటే నవీన్ హీరోగా తెలుగు నటించిన మొదటి సినిమా `ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ`. ఈ కామెడీ చిత్రం సైతం సూపర్ హిట్ అందుకుంది.
అయితే ఈ చిత్రానికిగానూ నవీన్కి `దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్` బెస్ట్ యాక్టర్ అవార్డు వరించింది. నటుడిగా బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చిన విషయాన్ని నవీన్ తాజాగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే కరోనా కారణంగా ఈ ఈవెంట్ జరగలేదు. దీంతో ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహకులు డైరెక్ట్ గా ఈ అవార్డుని నవీన్ ఇంటికి పంపించారట. కానీ అక్కడ తను లేడు. దీంతో ఆ ఇంటి వాచ్మెన్ ఈ అవార్డుని తీసుకున్నారట. ఈ విషయాన్ని నవీన్ కామెడీగా చెబుతూ అవార్డు ఫోటోలు పంచుకున్నారు.
`ఈ రోజు ఇది(అవార్డు) ఇంటికి వచ్చింది. `ఏజెంట్` సినిమాకిగానూ బెస్ట్ యాక్టర్గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇది. కరోనా కారణంగా ఫెస్టివల్ జరగలేదు. దీంతో వాళ్లు దీన్ని ఇంటికి పంపించారు. ఇంట్లో ఎవరూ లేరు. దీంతో మా వాచ్మెన్ అవార్డుని తీసుకున్నాడు. దీంతో మా బిల్డింగ్లో అవార్డు అందుకున్న మొదటి వ్యక్తిగా నిలిచాడు` అని పోస్ట్ పెట్టాడు నవీన్. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది.
నెటిజన్లు ఓ రేంజ్లో దీనిపై కామెంట్లు చేస్తున్నారు. `ఆల్ ది బెస్ట్ వాచ్మెన్గారు మీ భవిష్యత్ ప్రాజెక్ట్ లకు`, `అందరు వాచ్మెన్లు ప్రతిభతోనే పుడతారు. వాళ్లు ఆస్కార్కి అర్హులు`, `నువ్వు చివరి నీ వాచ్మెన్ కూడా అవార్డు పొందేలా చేశావ్. అది నీ నైజాం అన్నా..` అంటూ సెటైరికల్ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. చివరికి అవార్డులోనూ కామెడీ చేశావ్ పో అని, అవార్డులపై కామెడీనా అంటూ కొందరు చురకలు కూడా అంటిస్తున్నారు.