#Yatra2:'యాత్ర' దర్శకుడికి సీఎం జగన్ రూ.20 కోట్ల స్థలం? నిజమెంత?
‘రూరల్ మినీ స్టూడియో’ నిర్మిస్తానని... చిత్ర పరిశ్రమను విస్తృతం చేస్తానని... అందుకు హార్సిలీహిల్స్లో పదెకరాల స్థలం ఇవ్వాలని కోరుతూ గత ఏడాది జూన్ 17న ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
![Jagan 20 Crore Gift To Yatra 2 Director Mahi V Raghav? jsp Jagan 20 Crore Gift To Yatra 2 Director Mahi V Raghav? jsp](https://static-ai.asianetnews.com/images/01hnz4186kw0e412jte88rq8yd/cm-jagan-mahi-v-raghav-jpg_363x203xt.jpg)
బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో రిలీజ్ అయిన యాత్ర2(Yatra2 Movie)ఫస్ట్ పార్ట్ యాత్ర(Yatra)రేంజ్ లో రచ్చ చేస్తుందని అందరూ భావించారు. కానీ సినిమా మొదటి రోజు నుంచీ నుండి అనుకున్న స్దాయిలో కలెక్షన్స్ పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించ లేక పోయింది.రెండో రోజు భారీగా డ్రాప్ అయిన సినిమా గురించి ఇప్పుడు…ఓ విషయం బయిటకు వచ్చింది. మీడియాలో ప్రచారం జరుపుతున్న ప్రచారం మేరకు..
తన సొంత సినిమా యాత్ర-2 దర్శక-నిర్మాత మహీ వి.రాఘవకు అప్పనంగా ప్రభుత్వ భూమిని కట్టబెట్టేందుకు జగన్ సర్కారు వేగంగా పావులు కదిపిందనే ప్రచారం జరుగుతోంది. సుమారు రూ.20 కోట్ల విలువ చేసే రెండెకరాల స్థలాన్ని అప్పగించేందుకు రంగం సిద్ధమైందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ‘త్రీ ఆటమ్ లీవ్స్’ అనే సంస్థ యాత్ర-2 చిత్రాన్ని నిర్మించింది. దీని వ్యవస్థాపకుడు మహీ వి.రాఘవ. సినిమా డైరెక్టర్ కూడా ఆయనే. ‘రూరల్ మినీ స్టూడియో’ నిర్మిస్తానని... చిత్ర పరిశ్రమను విస్తృతం చేస్తానని... అందుకు హార్సిలీహిల్స్లో పదెకరాల స్థలం ఇవ్వాలని కోరుతూ గత ఏడాది జూన్ 17న ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
నిజానికి యాత్ర-2 ఆలోచన మొదలైనప్పుడే మహీ వి.రాఘవ అప్లికేషన్ పెట్టుకోగా... చిత్రం విడుదలవ్వగానే.. భూబదిలీకి రంగం సిద్ధమైందని అంటున్నారు. ఆ దరఖాస్తుపై చర్యలు తీసుకోవాలంటూ గత ఏడాది సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డి పర్యాటక శాఖను ఆదేశించారు. గత నెల 29న ఆ ఫైలు సంగతి తేల్చాలంటూ రెవెన్యూ స్పెషల్ సీఎస్ నుంచి అన్నమయ్య జిల్లా కలెక్టర్కు లేఖ వెళ్లింది.
ఈ నెల 9న కలెక్టర్ నుంచి బి.కొత్తకోట తహసీల్దార్కు లేఖ వెళ్లింది.శుక్రవారం ‘యాత్ర-2’ విడుదల కాగానే.. మదనపల్లి ఆర్డీవో హరిప్రసాద్, బి.కొత్తకోట మండల అధికారులు హార్సిలీహిల్స్కు వెళ్లి స్థలాన్ని పరిశీలించారు. తొలి విడతలో దాదాపు రెండెకరాల భూమిని మహీ వి.రాఘవకు కేటాయించేందుకు వీలుగా ప్రతిపాదను సిద్ధం చేసినట్లు చెప్తున్నారు. నిజానికి హార్సిలీహిల్స్లో పర్యాటక శాఖకు 20 ఎకరాల స్థలం ఉంది. ఇక్కడ క్రీడా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గత తెలుగు దేశం ప్రభుత్వం భావించింది. ఆ మేరకు 2018లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు 3.74 ఎకరాలను కేటాయించింది. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో.. శిక్షణ కేంద్ర నిర్మాణం మరుగున పడింది. ఇప్పుడు అదే స్థలాన్ని మహీ వి.రాఘవకు కట్టబెడుతున్నారని అంటున్నారు. అందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.