దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు.
అపజయమెరుగని దర్శకుడిగా ఉన్న కొరటాల శివకు ఆచార్య భారీ షాక్ ఇచ్చింది. ఈ చిత్రం ఆయన్ని అన్ని విధాలా ముంచేసింది. ఆర్థికంగా, ఫేమ్ పరంగా పెద్ద ఎత్తున నష్టపోయారు. మరోవైపు చిరంజీవి పరోక్ష విమర్శలు ఆయన్ని మరింత ఇబ్బంది పెట్టాయి. దీంతో బౌన్స్ బ్యాక్ కావాలని అనుకుంటున్నారు. తానేమిటో నిరూపించాలని కసిగా ముందుకు వెళుతున్నారు. ఆ కమిట్మెంట్ ఎన్టీఆర్ 30 చిత్ర ప్రతి అంశంలో కనిపిస్తుంది.
దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో ఎన్టీఆర్ 30 తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ ని రంగంలోకి దింపారు. జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా ఎంచుకున్నారు. ఇక విలన్ ని బాలీవుడ్ నుండి తీసుకొచ్చారు. ఎన్టీఆర్ 30లో ప్రతినాయకుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. నేడు దీనిపై అధికారిక ప్రకటన చేశారు. సైఫ్ అలీ ఖాన్ కి ఎన్టీఆర్ 30 సెట్స్ లోకి ఆహ్వానం పలికారు. హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివతో కలిసి సైఫ్ ఫోటోలకు ఫోజిచ్చారు.
ఎన్టీఆర్ 30లో విలన్ గా సైఫ్ నటిస్తున్నారంటూ కొన్నాళ్లుగా వినిపిస్తుంది. ఈ పుకార్లు నిజం చేస్తూ నేడు అధికారిక ప్రకటన వెలువడింది. సైఫ్ ఎంట్రీతో ప్రాజెక్ట్ పై హైప్ మరో స్థాయికి చేరింది. నార్త్ ఇండియాలో ఎన్టీఆర్ 30కి ఈ పరిణామం కలిసొస్తుంది. బాలీవుడ్ కి చెందిన జాన్వీ, సైఫ్ అలీఖాన్ నటించడం ద్వారా నార్త్ ఆడియన్స్ కి చేరువ కావడం సులభం అవుతుంది.
ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన స్పెషల్ సెట్స్ లో ఎన్టీఆర్ 30 షూటింగ్ జరుగుతుంది. నెక్స్ట్ షెడ్యూల్ గోవాలో జరపనున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 2024 సమ్మర్ కానుకగా విడుదల కానుంది.
