రూల్స్ రంజన్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చిత్ర పరిశ్రమపై విమర్శలు చేసే వారికి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చాడు హైపర్‌ ఆది. అదే సమయంలో స్టార్‌ హీరోల గొప్పతనం చాటి చెప్పాడు.  

హైపర్‌ ఆది స్టేజ్‌ పైకి వచ్చాడంటే పంచ్‌లతో రెచ్చిపోతాడు. గుక్కతిప్పుకోకుండా ప్రశంసలు కురిపిస్తాడు. అదే సమయంలో విమర్శలకు కౌంటర్లిస్తాడు. ఉన్నంత సేప్‌ చెడుగుడు ఆడుకుంటాడు. తాజాగా మరోసారి రెచ్చిపోయాడు. `రూల్స్ రంజన్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చిత్ర పరిశ్రమపై విమర్శలు చేసే వారికి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చాడు. అదే సమయంలో స్టార్‌ హీరోల గొప్పతనం చాటి చెప్పాడు. వారిని ఏ విషయంలో ఆదర్శంగా తీసుకోవాలో వెల్లడించాడు. ఒక్కో హీరో గురించి ఒక్కో స్పెషాలిటీ చెబుతూ ఆద్యంతం అలరించారు. కౌంటర్లివ్వాల్సిన వారికి ఆయన గట్టిగానే ఇచ్చాడు. 

చిత్ర పరిశ్రమపై విమర్శలు పెరిగిన నేపథ్యంలో ఇటీవల జాతీయ అవార్డులు సాధించిన వారిని చూపిస్తూ, వారిని అభినందిస్తూ, ఇదే విమర్శలు చేసే వారికి సమాధానం అని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమకి వచ్చిన అవార్డులను చూసి ఇకనైనా విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. అదే సమయంలో సినిమాల్లో చూసి చెడు చేస్తున్నారనే దానికి హైపర్‌ ఆది సమాధానం చెప్పాడు. 

సినిమా ఎప్పుడు మంచే నేర్పించిందని, చెడు ఎప్పటికీ నేర్పించదు, సినిమాల్లో చెడుని కాదు, మంచిని స్వీకరించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి నుంచి కుర్రహీరోల వరకు అందరి గొప్పతనం చెప్పాడు. పల్లెటూరు నుంచి నగరానికి వచ్చి ఆయన్నే దేవుడిగా కొలిచే స్థాయికి ఎదగిన పెద్ద ఎన్టీఆర్‌ను చూసి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని నేర్చుకోండని, అలాగే విజయం ఎంత ముఖ్యమో, వినయం అంతే ముఖ్యమని 90 ఏళ్ల జీవితం, 75 ఏళ్ల నటన జీవితం ఉన్న ఏయన్నార్‌ను చూసి నేర్చుకోవాలని చెప్పారు హైపర్‌ ఆది. 

`అల్లూరి సీతారామరాజు` లాంటి చిత్రాలు తీసి ఈ రోజుల్లో తెలుగు సినిమా స్థాయిని పెంచిన,  నిర్మాతకు నష్టం వస్తే డబ్బులు తిరిగిచ్చే మంచి మనసున్న కృష్ణగారిని చూసి నేర్చుకోవాలని, అలాగే ఇంటికి వచ్చింది శత్రువు అయినా అన్నం పెట్టి మాట్లాడాలనే సంస్కారాన్ని కృష్ణం రాజుని చూసి నేర్చుకోవాలని, సంపాదించిన డబ్బును జాగ్రత్తగా కాపాడుకుని చూపించి, ఎవరికైనా పెట్టే స్థితిలో ఉండాలి కానీ నెట్టే స్థితిలో ఉండకూడదని చెప్పి బతికినంతకాలం రాజులా బతికిన శోభన్‌బాబుని చూసి నేర్చుకోవాలన్నారు. తెలుగు సినిమాలో ఏదైనా పాత్ర దక్కితే చాలనుకుని తెలుగు సినిమానే శాసించే స్థాయికి చేరిన మెగాస్టార్‌ చిరంజీవి చూసి నేర్చుకోవాలన్నారు. 

మరోవైపు `తల్లికి క్యాన్సర్‌ వచ్చి మరణిస్తే అలాంటి స్థితి ఏ తల్లికి రాకూడదని బసవతారకం ఆస్పత్రిని పెట్టిన బాలకృష్ణని చూసి బాగా బతకడం అంటే మనం మాత్రమే కాదు.. పక్కన వాళ్లను కూడా బతికించాలని నేర్చుకోవాలని తెలిపారు. ఇక నాగ్‌ గురించి చెబుతూ ఆరవై ఏళ్ల వయసులో కూడా ఆరోగ్యం ఉంటే అన్ని బావుంటాయని నమ్ముతూ నవ మన్మధుడిలా కనిపించే నాగార్జునను చూసి నేర్చుకోవాలని, మరోవైపు నాన్న గొప్పొడు నేను కాదు అని గ్రహించి ముందుకెళ్లే విక్టరీ వెంకటేశ్‌, తనకు జీవితం ఇచ్చిన గురువు దాసరి నారాయణరావు దైవంగా భావించే మోహన్‌బాబుని చూసి గురు భక్తిని నేర్చుకోండన్నారు.

ప్రపంచ గర్వించే స్థాయికి ఎదిగినా ఒదిగి ఉండాలనే విషయాన్ని ప్రభాస్‌ని చూసి నేర్చుకోవాలని, అంతేకాదు ఎంతోమంది చిన్నారుల గుండెల్ని కాపాడుతున్న మహేష్‌బాబుని చూసి చాలా నేర్చుకోవచ్చు. పేదల  ఆకలి తీరితే నా ఆకలి తీరినట్లే అని భావించి పవన్‌కల్యాన్‌ని చూసి నేర్చుకోండి సంపాదించడమే కాదు.. సహాయం చేయడం కూడా ముఖ్యమని తెలిపారు. 20ఏళ్ల వయసులో ఉంటే మనం ఆడుకోవాలా? చదువుకోవాలా? అనే కన్‌ఫ్యూజన్‌లో మనం ఉంటే, అదే 20ఏళ్ల వయసులో ఇండస్ట్రీని ఓ ఆట ఆడుకున్నా జూ ఎన్టీఆర్‌ ని చూసి నేర్చుకోవాలని తెలిపారు. తండ్రి మాస్టారుగా ఉండే బుద్దులు నేర్పిస్తే, కొడుకు సిగరేట్‌ కాలుస్తాడు, తండ్రి నిర్మించే వాడైతే, కొడుకు కూల్చేవాడవుతాడు. కానీ తండ్రి ఎరాని కంటిన్యూ చేసే చరిత్ర రామ్‌చరణ్‌ ది తండ్రి కళ్లల్లో ఆనందం చూడం కోసం ఎలా ఎదగాలనేది చరణ్‌ని చూసి నేర్చుకోవాలన్నారు. 

2003లో ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తే వీడేంటి హీరో ఇంట్లో కూర్చోకా అని విమర్శల నుంచి ఇరవై ఏళ్లలో జాతీయ అవార్డుని ఇంట్లో కూర్చోబెట్టుకున్న అల్లు అర్జున్‌ని చూసే నేర్చుకోవాలని తెలిపారు. మరోవైపు సొంతంగా ఎదిగిన రవితేజ, నాని, విజయ్‌ దేవరకొండ, గోపీచంద్‌తోపాటు సాయిధరమ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌, రామ్‌, అలాగే అభిమానులుగా ఉండి, హీరోలుగా ఎదిగిన కిరణ్‌ అబ్బవరం, కార్తికేయ, నిఖిల్‌, విశ్వక్‌ సేన్‌, శ్రీవిష్ణు, సుధీర్‌బాబులను చూసి నేర్చుకోండి టాలెంట్‌ ఉంటే ఒకరోజు మనకు వస్తుందని చెప్పుకొచ్చాడు హైపర్‌ ఆది. అలాగే రివ్యూ రైటర్స్,పబ్లిక్‌ టాక్‌ చెప్పే వాళ్లు వీరంతా సినిమాల్లో భాగమే అని తెలిపారు ఆది.  

మీమర్స్, ట్రోలర్స్ పై స్పందిస్తూ వారి క్రియేటివిటీకి హ్యాట్సాప్‌. వారి మీమ్స్ నవ్వుకునేలా ఉంటున్నాయి. కానీ ఒక్క శాతం అదుపు తప్పుతున్నాయి. వారంతా కొంచెం జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. కిరణ్‌ అబ్బవరం హీరోగా, నేహా శెట్టి కథానాయికగా నటించిన `రూల్స్ రంజన్‌` సినిమా ఈ నెల 6న విడుదల కాబోతుంది.