కోర్టు తీర్పు దెబ్బ: సినీ హీరో ప్రభాస్ ఇల్లు సీజ్
శేరిలింగంపల్లి తహసీల్దార్ వాసుచంద్ర ఆ స్థలంలోని నిర్మాణాలు తొలగించి సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలంలో ప్రభాస్ ఇల్లు ఉండటంతో దాన్నీ సీజ్ చేశారు.
హైదరాబాద్: తెలుగు సినీ హీరో ప్రభాస్ ఇంటిని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. హైదరాబాదులో గల రాయదుర్గంలోని పైగా గ్రామ రెవెన్యూ సర్వే నంబరు 46లో గల 84 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించి 40 ఏళ్లుగా కోర్టులో ఉన్న కేసులు తొలగిపోయింది.
దాంతో శేరిలింగంపల్లి తహసీల్దార్ వాసుచంద్ర ఆ స్థలంలోని నిర్మాణాలు తొలగించి సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలంలో ప్రభాస్ ఇల్లు ఉండటంతో దాన్నీ సీజ్ చేశారు. ఈ భూమి ప్రైవేటు వ్యక్తులకు చెందుతుందని మాల రాములు, నీరుడు లక్ష్మయ్య కోర్టుకు ఎక్కారు.
వారి నుంచి కొంత భూమి కొనుగోలు చేసిన శివరామకృష్ణ అనే వ్యక్తి కూడా కోర్టుకు వెళ్లారు. వారి వాదనలు విన్న న్యాయస్థానం బాధితులకు అనుకూలంగా తీర్పు చెప్పింది. భూమిని ఫిర్యాదుదారుల పేర పట్టా చేయాలని అధికారులను ఆదేశించింది. కానీ అప్పటి తహసీల్దార్ పట్టా చేయకపోవడంతో శివరామకృష్ణ మళ్లీ కోర్టుకు వెళ్లాడు.
దాంతో తహసీల్దార్కు కోర్టు ధిక్కరణ శిక్ష విధించింది. ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆయనకు అనుకూలంగా తీర్పుచెప్పి కోర్టు కేసు కొట్టేసింది.