రాజమౌళితో పనిచేయాలని ఉందంటున్న మిస్ వరల్డ్...బాహుబలి, మగధీర ఫేవరేట్ చిత్రాలట
మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ దర్శక ధీరుడు రాజమౌళిపై ప్రశంశలు కురిపించారు. ఈ తరానికి గొప్ప దర్శకునిగా ఆయనను కొనియాడారు. కుదిరితే ఆయనతో పనిచేయడానికి సిద్ధం అన్నారు.
దర్శకుడు రాజమౌళిని ప్రసంశలలో ముంచెత్తింది మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్. ఇండియాలోని గొప్ప దర్శకుల్లో ఒకరిగా ఆయనను కీర్తిస్తుంది. అవకాశం దొరికితే ఆయనతో పనిచేయడానికి సిద్ధం అని తన మనసులో మాట బయటపెట్టింది. 2017లో మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న 23ఏళ్ల మానుషీ చిల్లర్ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం అయ్యింది. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కనున్న భారీ పీరియాడిక్ మూవీ పృథ్విరాజ్ చిత్రంతో ఆమె వెండితెర ఎంట్రీ ఇవ్వనున్నారు.
దర్శకుడు చంద్రప్రకాష్ ద్వివేది తెరకెక్కించనున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఇక ఇలాంటి భారీ పీరియాడిక్ చిత్రాలలో నటించడానికి బాహుబలి లాంటి చిత్రం స్ఫూర్తిని ఇచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు. బాహుబలి మూవీ చూశానన్న మానుషీ...దర్శకుడు రాజమౌళి ఆ చిత్రంలో స్త్రీ పాత్రలు మలచి తీరు అద్భుతం అన్నారు. ఆ పాత్రలకు ప్రాధాన్యత మరియు బ్యూటీని జతచేశారు అన్నారు.
ఈ జనరేషన్ లో రాజమౌళి ఓ గొప్ప దర్శకుడు, ఆయన సినిమా మేకింగ్ కి నేను పెద్ద ఫ్యాన్ ని అన్నారు. ఇక భారతీయ ప్రేక్షకుల కోసం కొన్ని ఐకానిక్ చిత్రాలు ఆయన రూపొందించారు అన్నారు. ఆయన తెరకెక్కించిన మగధీర, బాహుబలి చిత్రాలు తనకు ఇష్టం అని, ఎప్పుడు సమయం దొరికినా వాటిని చూస్తాను అని ఆమె చెప్పుకొచ్చారు. అక్షయ్ తో పృథ్విరాజ్ మూవీకి సైన్ చేసిన మానుషీ, విక్కీ కౌశల్ సరసన మరో చిత్రం చేస్తున్నారు.