`మా 12 ఏళ్ల కల ఈ సాయంత్రం నిజమైంది. మాకు సినిమా తప్ప ఇంకేం తెలియదు. ఆ సినిమాలతోనే అనుకున్నది సాధించాలని అనుకున్నాం` అని అన్నారు `డీజే టిల్లు` హీరో సిద్దు జొన్నలగడ్డ. 

ఎన్ని పాండమిక్‌లు వచ్చినా, తుఫాన్‌లు వచ్చినా ఆడియెన్స్ కి నచ్చే సినిమాలు చేయాలనే మా ప్రయత్నాన్ని ఆపబోం అంటున్నారు హీరో సిద్ధు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda). అంతేకాదు తమ తలరాతలు తామే రాసుకోవాలని చేపట్టిన మా కలం, బలం ఇప్పుడు సక్సెస్‌ అయ్యిందని సిద్ధు చెప్పారు. ఆయన హీరోగా నటించిన `డీజే టిల్లు`(DJ Tillu) సినిమా శనివారం విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇందులో నేహా శెట్టి కథానాయికగా నటించింది. 

 సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి DJ Tillu చిత్రాన్ని నిర్మించింది. దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కించగా, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. సినిమా సక్సెస్‌ సాధించిన సందర్భంగా వరుసగా సక్సెస్‌ టూర్లు నిర్వహిస్తోంది యూనిట్‌. అందులో భాగంగా బుధవారం వైజాగ్‌లో విజయోత్సవ సభని నిర్వహించారు. విశాఖ గురజాడ కళాక్షేత్రంలో ఈ సక్సెస్‌ సెలబ్రేషన్‌ జరిగింది. ఇందులో చిత్రబృందానికి జ్ఞాపికల్ని బహూకరించారు. 

ఈ సందర్భంగా హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ...మా 12 ఏళ్ల కల ఈ సాయంత్రం నిజమైంది. మాకు సినిమా తప్ప ఇంకేం తెలియదు. ఆ సినిమాలతోనే అనుకున్నది సాధించాలని అనుకున్నాం. `క్రిష్ణ అండ్ హిస్ లీల` సినిమా చేసి ఓటీటీలో రిలీజ్ చేశాం. దానికి మంచి స్పందన వచ్చింది. అ తర్వాత `మా వింతగాథ వినుమా` సినిమా చేస్తే ఫర్వాలేదన్నారు. ఇప్పుడు `డిజె టిల్లు` రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఈ జర్నీలో నేను థాంక్స్ చెప్పుకోవాలనుకునే వ్యక్తి మా నిర్మాత వంశీ అన్న. మమ్మల్ని నమ్మి సినిమా ఇచ్చారు. మా తలరాత మేమే రాసుకోవాలని చేపట్టిన మా కలం, బలం ఇవాళ విజయం సాధించాయి. ఎన్ని పాండమిక్ లు, తుఫాన్ లు వచ్చినా మీకు నచ్చే సినిమాలు చేయాలనే మా ప్రయత్నాలు ఆపము. అలాగే ఇంతటి పెద్ద విజయాన్ని అందించిన ఆడియెన్స్ కి బిగ్‌ థ్యాంక్స్` అని చెప్పారు సిద్దు. 

 హీరోయిన్ నేహాశెట్టి మాట్లాడుతూ, `డీజే టిల్లు మీకు ఇంత బాగా నచ్చినందుకు సంతోషంగా ఉంది. వైజాగ్ నాకు చాలా ప్రత్యేకం. నా సక్సెస్ జర్నీ ఇక్కడి నుంచే మొదలైంది. నేను వేరే ఒక సినిమా షూటింగ్ లో విశాఖలో ఉండగా ఈ సినిమా కోసం పిలుపు వచ్చింది. రాధిక పాత్రను నేను సరిగ్గా పోషించగలనని నమ్మిన దర్శకుడు విమల్, నిర్మాత నాగవంశీ గారికి కృతజ్ఞతలు. ఇవాళ మీ రెస్పాన్స్ చూస్తుంటే రాధిక క్యారెక్టర్ లో మెప్పించానని అర్థమవుతోంది` అని చెప్పింది నేహాశెట్టి. 

దర్శకుడు విమల్ కృష్ణ మాట్లాడుతూ, డిజె టిల్లు చిత్రంతో మాకు గొప్ప విజయాన్ని అందించారు. మీరు ఇచ్చింది సక్సెస్ మాత్రమే కాదు ఒక కొత్త జీవితం. ఓవర్సీస్ సహా మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు` అని తెలిపారు. 

నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, డిజె టిల్లు చిత్రానికి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా సంస్థకు మరో మంచి సక్సెస్ ఇచ్చారు. డిజె టిల్లు టీమ్ అందరికీ శుభాకాంక్షలు చెబుతున్నా` అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై సిద్ధు, నేహాశెట్టి చేసిన డాన్స్ పర్‌ఫెర్మెన్స్ ఆడియెన్స్ ని కనువిందు చేసింది.