#pawankalyan:‘హరి హర వీరమల్లు’నుంచి క్రిష్ తప్పుకున్నారా? నిజమెంత
క్రిష్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా ‘హరి హర వీర మల్లు’ (HHVM) సినిమా తెరపైకి వచ్చింది. నిజానికి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమై చాలా కాలం అయినా పూర్తి కాలేదు.
![Director Krish Exits From Hari Hara Veera Mallu jsp Director Krish Exits From Hari Hara Veera Mallu jsp](https://static-ai.asianetnews.com/images/01frmtymjf0dgmrd8shhn22mcp/2-jpg_363x203xt.jpg)
పవన్ కళ్యాణ్ నటిస్తోన్న తొలి పీరియాడికల్ డ్రామా హరిహర వీరమల్లు. మొఘల్ కాలంలో ప్రజలకు అండగా నిలబడిన ఓ బందిపోటు దొంగ పాత్రనే ఇందులో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. మొఘల్ చక్రవర్తి పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కనిపించబోతున్నారు. ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. నిధి అగర్వాల్ పంచమి అనే పాత్రలో నటిస్తుంటే, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మొఘల్ రాకుమారి పాత్రలో కనిపించనుందని టాక్. డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా చేస్తున్న సమయంలో వచ్చిన కోవిడ్ గ్యాప్లో మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్తో కొండపొలం సినిమా చేశారు. ఆ సినిమా రిలీజైంది. మధ్యలో ఓ వెబ్ సిరీస్ సైతం నిర్మించారు. కానీ ఇంతకాలం అయినా ఈ సినిమా మాత్రం పూర్తి కాలేదు. ఈ నేపధ్యంలో ఈ చిత్రంపై రకరకాల విషయాలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి డైరక్టర్ క్రిష్ బయిటకు వచ్చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు 2020లో మొదలైన ఈ సినిమా రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ఇచ్చిన డేట్స్ ని ఫెరఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని సినిమా పూర్తి చేయటంలో క్రిష్ ఫెయిల్ అయ్యాడని చెప్పుకుంటున్నారు. మరో ప్రక్క అవుట్ ఫుట్ చూసి పవన్ అసంతృప్తిగా ఉన్నారని, రీషూట్ పెట్టినా హ్యాపీగా లేరని చెప్పుకుంటున్నారు. నిజమెంతో కానీ పవన్, క్రిష్ మధ్యన క్రియేటివ్ డిఫరెన్స్ లు పీక్స్ కు చేరుకున్నాయని, దానికి తోడు బడ్జెట్ ఇష్యూలు, పవన్ కళ్యాణ్ పొలిటికల్ కమిట్మెంట్స్ సినిమాని ముందుకు వెళ్లనీయకుండా చేసాయని టాక్. అయితే నిర్మాత ఏ ఎం రత్నం మాత్రం ఈ ప్రాజెక్టుపై చాలా ఖర్చు పెట్టారని ఎలా పూర్తి చేయాలా అని తల పట్టుకున్నాడంటున్నారు. ఈ క్రమంలో క్రిష్ ..తాజాగా అనుష్క ప్రధాన పాత్రలో ఓ స్క్రిప్టు రెడీ చేసారని యువి క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి. అయితే అఫీషియల్ సమాచారం మాత్రం కాదు.
క్రిష్ తప్పుకుంటే వేరే దర్శకుడు సీన్ లోకి వస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్-ఇండియన్ చిత్రం 17వ శతాబ్దానికి చెందిన ఓ దొంగ కథ. ఈ బహుభాషా చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మొఘలులు, కుతుబ్ షాహీ రాజుల కాలం నాటి కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో అనసూయ కీలక పాత్రలో కనిపించనుంది. ఆ కాలపు చారిత్రక అంశాలకు సంబంధించిన వివరాలు, పరిశోధనలకు ఈ సినిమాలో ప్రాధాన్యత ఇచ్చారు. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తొలిసారిగా చారిత్రక చిత్రంలో కనిపించనుండటం హరి హర వీరమల్లు సినిమాకి ప్రధాన ఆకర్షణ.