కృత్రిమ మేధస్సు మానవ జాతి మనుగడపై ప్రభావం చూపిస్తుందని ఇటీవల కొందరు టెక్‌ నిపుణులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో జేమ్స్ కామెరూన్‌ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

`కృత్రిమ మేధస్సు మానవ మనుగడకే ప్రమాదకరం అని `అవతార్‌` దర్శకుడు జేమ్స్ కామెరూన్‌ అన్నారు. తాను ఈ విషయాన్ని నలభై ఏళ్ల క్రితమే హెచ్చరించినట్టు చెప్పారు. తాను 1984లో రూపొందించిన సైన్స్ ఫిక్షన్‌ మూవీ `ది టెర్మినేటర్‌` తో హెచ్చరించినట్టు చెప్పారు. గతేడాది `అవతార్‌ 2` సినిమాని రూపొందించిన విషయం తెలిసిందే. ఇది మొదటి భాగం స్థాయిలో ఆదరణ పొందలేదు. అయితే తాజాగా జేమ్స్ కామెరూన్‌.. ఓ ఇంటర్వ్యూలో ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్(ఏఐ) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కృత్రిమ మేధ మానవ జాతి మనుగడపై ప్రభావం చూపిస్తుందని ఇటీవల కొందరు వ్యాపారవేత్తలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో జేమ్స్ కామెరూన్‌ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. కృత్రిమ మేధకి ఆయుధీకరణ చేస్తే అది విపత్కర పరిణామాలకు దారి తీస్తుందన్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ, తాను ఆ వ్యాపారవేత్తలతో ఏకీభవిస్తున్నానని, ఈ విషయంపై తాను 1984లోనే హెచ్చరించానని, కానీ దాన్ని పట్టించుకోలేదని ఆయన వెల్లడించారు. తాను రూపొందించిన `టెర్మినేటర్‌` మూవీ కథ స్కైనెట్‌ అనే సూపర్‌ కంప్యూటర్‌ సృష్టించిన సైబర్నెటిక్‌ హంతకుడి చుట్టూ తిరుగుతుందని, కృత్రిమ మేధని ఆయుధీకరిస్తే అది మరింత ప్రమాదకరంగా మారుతుందని జేమ్స్ కామెరూన్‌ అభిప్రాయపడ్డారు. సినిమాలో జరిగినట్టే బయట జరిగే ప్రమాధం ఉందని ఆయన తెలిపారు. 

అణ్వాయుధాల్లో ప్రస్తుతం ఉన్న పోటీకి సమానంగా ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్ పోటీ చేరుకుంటుందని భావిస్తున్నానని, వాటిని మనం త్వరగా అభివృద్ధి చేయకపోతే వేరెవరో ముందుంటారు కాబట్టి పోటీ పెరుగుతుందని ఆయన వెల్లడించారు. యుద్ధ భూమిలో కృత్రిమ మేధ వినియోగం గురించి చెబుతూ కంప్యూటర్లు వేగంగా పనిచేస్తాయని, వాటిలో మానవులు జోక్యం చేసుకోలేరని తెలిపారు. అప్పుడు శాంతి చర్చలు,యుద్ధ విరమణ అవకాశాలు లేకుండా పోతాయన్నారు. అలాంటి ఏఐలను నియంత్రించాలంటే `ఢీ ఎస్కలేషన్‌`పై దృష్టి పెట్టాలని తెలిపారు. కానీ కృత్రిమ మేధ వ్యవస్థ అలాంటి సూత్రాలకు కట్టుబడి ఉంటుందా అనే సందేహం వ్యక్తం చేశారు. 

ఏఐతో అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ అది వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుందని, అది ప్రపంచం అంతం అయ్యే అవకాశం ఉందన్నారు. కొద్ది రోజుల క్రిత అత్యుధునిక ఏఐ వ్యవస్థల అభివృద్ధిని నిలిపివేయాల్సిన అవసరం ఉందని కోరుతూ కొందరు టెక్‌ నిపుణులు బహిరంగ లేఖ రాశారు. దీనిపై ట్విట్టర్‌ సీఈవో ఎలాన్‌ మస్క్, యాపిల్‌ సహ వ్యవస్థాపకుడు స్లీవ్‌ వోజ్నియాక్‌ సహ వెయ్యి మందికిపైగా నిపుణులు సంతకం చేశారు. `పాజ్‌ జియాంట్‌ ఏఐ ఎక్స్ పరిమెంట్‌` పేరిట ఈ లేఖని విడుదల చేశారు. 

జేమ్స్ కామెరూన్‌.. `టెర్మినేటర్‌`తో తానేంటో నిరూపించుకున్నారు. సైన్స్ ఫిక్షన్‌, విజువల్‌ వండర్‌ చిత్రాలను రూపొందించి మెప్పించారు జేమ్స్. ప్రపంచ సంచలన మూవీ `టైటానిక్‌`ని ఆయనే రూపొందించారు. దీంతోపాటు మరో సంచలనం `అవతార్‌` సృష్టికర్త కూడా ఆయనే. ప్రస్తుతం దీన్నుంచి రెండు పార్ట్ లు వచ్చాయి. మరో మూడు పార్ట్ లను రూపొందిస్తున్నారు.