Cinema tickets issue: సినిమా టికెట్ల కొత్త జీవో రెడీ.. సంతకం చేసిన సీఎం జగన్, ఫలించిన చిరంజీవి శ్రమ
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. గత ఏడాది కాలంగా చిత్ర పరిశ్రమ ఏపీలో తగ్గించిన టికెట్ ధరల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. గత ఏడాది కాలంగా చిత్ర పరిశ్రమ ఏపీలో తగ్గించిన టికెట్ ధరల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా థియేటర్ యాజమాన్యాలు, ఎగ్జిబిటర్లు నష్టాలకు గురవుతున్నారు. కొన్ని చోట్ల థియేటర్లు రన్ చేయలేక మూసివేసిన పరిస్థితులు కూడా చూశాం.
ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ తరుపున మెగాస్టార్ చిరంజీవి పలు మార్లు ఏపీ ప్రభుత్వాన్ని రిక్వస్ట్ చేశారు. కొన్ని సార్లు స్వయంగా సీఎం జగన్ ని వెళ్లి కలసి పరిస్థితిని వివరించారు. రీసెంట్ గా గత నెల ఫిబ్రవరి 10న చిరంజీవి.. సూపర్ స్టార్ మహేష్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లాంటి హీరోలని వెంటబెట్టుకుని జగన్ ని కలసిన సంగతి తెలిసిందే. దీనితో జగన్ త్వరలోనే సమస్యని పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు.
ఆ తర్వాత ఆ దిశగా అడుగు పడలేదు. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రం విడుదలయింది. ఆ చిత్రం కూడా తగ్గించిన టికెట్ ధరలతోనే రన్ ఐంది. దీనితో మరోసారి ప్రభుత్వంపై విమర్శలు వినిపించాయి. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణించడం వల్ల జీవో ఆలస్యం అయింది అంటూ ఏపీ మంత్రులు భీమ్లా నాయక్ చిత్రంపై స్పందించారు. భీమ్లా నాయక్ చిత్రాన్ని కొన్నిరోజులు వాయిదా వేసుకుని ఉండాల్సింది అంటూ పేర్ని నాని కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా శుక్రవారం ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇది పాన్ ఇండియా మూవీ. ఇప్పుడైనా సినిమా టికెట్ ధరలపై ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేస్తుందా అంటూ టాలీవుడ్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఇలాంటి తరుణంలో సీఎం జగన్ సినిమా టికెట్ ధరల కొత్త జీవోపై నేడు సంతకం చేసినట్లు తెలుస్తోంది. జోవోని సోమవారం సాయంత్రం కానీ.. మంగళవారం కానీ వవిడుదల చేయనున్నట్లు టాక్. ఈ వార్తతో టాలీవుడ్ లో కొత్త జోష్ పుట్టుకుని వచ్చింది. చిత్ర పరిశ్రమ కష్టాలు తీరినట్లే అని అంతా భావిస్తున్నారు. దీనితో చిరంజీవి శ్రమ ఫలించినట్లు అయింది.
టికెట్ ధరల్ని ఎంత మేరకు పెంచారు.. ఐదు షోలకు అనుమతి ఇచ్చారా లేదా, బెనిఫిట్ షోల పరిస్థితి ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే జీవో విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. మొత్తంగా టాలీవుడ్ కి బిగ్ రిలీజ్ లభించబోతోంది.