ఇప్పటి వరకు కొత్త సినిమాలు ప్రకటించలేదు చిరంజీవి.  ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌. నాన్న నాలుగు సినిమాలకు సైన్‌ చేశారంటూ వెల్లడించారు. 

చిరంజీవి ప్రస్తుతం `భోళాశంకర్‌` చిత్రంలో నటిస్తున్నారు. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. ఇందులో తమన్నా కథానాయిక. కీర్తిసురేష్‌ సిస్టర్‌ రోల్‌ చేస్తుంది. ఇప్పటి వరకు కొత్త సినిమాలు ప్రకటించలేదు చిరంజీవి. కానీ చాలా మంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఏది ఫైనల్‌ చేశారు? ఏది చర్చల దశలో ఉన్నాయనేది పెద్ద సస్పెన్స్. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌. నాన్న నాలుగు సినిమాలకు సైన్‌ చేశారంటూ వెల్లడించారు. అత్యధికంగా పారితోషికం అందుకుంటున్న హీరోల్లో ఒకరని, ఆయన ఇప్పటికీ తనకు స్ఫూర్తి అంటూ నాన్న గొప్పతనాన్ని చాటి చెప్పారు చరణ్. 

ఆయన ఏజ్‌ 68 అని, ఇప్పటికీ 5.30 గంటలకు నిద్ర లేస్తారని, చాలా హార్డ్ వర్క్ చేస్తారని, క్రమశిక్షణ గురించి గొప్పగా వెల్లడించారు చరణ్‌. అయితే ఇందులో చిరంజీవికి సంబంధించిన సినిమాల అప్‌డేట్‌ ఇవ్వడం హైలైట్ గా నిలుస్తుంది. చరణ్‌ చెప్పినట్టు ఆ నలుగురు దర్శకులెవరనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా నిలిచింది.అందుతున్న సమాచారం మేరకు చిరు.. ఇప్పటికే కళ్యాణ్‌ కృష్ణతో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. మలయాళ హిట్‌ మూవీ `బ్రో డాడి`కిది రీమేక్‌ అని తెలుస్తుంది. సిద్ధు జొన్నలగడ్డ, శ్రీలీల జంటగా కనిపిస్తారట. 

దీంతోపాటు `బింబిసార` ఫేమ్‌ వశిష్ట దర్శకత్వంలో పీరియాడికల్‌ ఫిల్మ్ ని ప్లాన్‌ చేశారు. ఈ సినిమా స్క్రిప్ట్ ఫైనల్‌ స్టేజ్‌లో ఉందని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుందని తెలుస్తుంది. అయితే మిగిలిన ఇద్దరు దర్శకులెవరనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. చిరంజీవితో సినిమా చేయడానికి పూరీ జగన్నాథ్‌ సిద్ధంగా ఉన్నాడు. కథలు కూడా చెప్పారు. కానీ ఇటీవలే `డబుల్‌ ఇస్మార్ట్` ప్రకటించారు. మరోవైపు వివి వినాయక్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ కథలు దొరకడం లేదు. 

అలాగే దర్శకుడు `వక్కంతం వంశీ`కూడా ఓ కథ చెప్పారట. వీరితోపాటు డైమండ్‌ రత్నబాబు సైతం ఓ కథ చెప్పగా, చిరు ఆసక్తిని చూపించారట. ఓ తమిళ దర్శకుడు కూడా చిరంజీవిని కలిసి స్క్రిప్ట్ నెరేట్‌ చేశారని సమాచారం. ప్రధానంగా ఈ డైరెక్టర్స్ పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీరిలో మిగిలిన ఇద్దరు ఎవరు? వీరు కాకుండా కొత్తవాళ్లు ఈ లిస్ట్ లో ఉన్నారా? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం నటిస్తున్న `భోళాశంకర్‌` చిత్రం విదేశాల్లో పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇది ఆగస్ట్ 11న విడుదల కాబోతుంది. 

ఇదిలా ఉంటే జీ20 సమ్మిట్‌లో ఓ సినిమా సెలబ్రిటీ పాల్గొనడం అరుదైన విషయం. ఆ అరుదైన ఘనత రామ్‌చరణ్‌కి దక్కింది. ఈ సందర్భంగా ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇండియన్‌ సినిమా గురించి చెబుతూ, `ఎన్నో ఏళ్లుగా గొప్ప సంస్కృతి, ఆధ్యాత్మిక‌త‌ల‌తో మిళిత‌మైన మ‌న గొప్ప‌దనాన్ని సినీ రంగం త‌ర‌పున తెలియ‌జేసే అవ‌కాశం రావ‌టం నా అదృష్టంగా భావిస్తున్నాను. మంచి కంటెంట్‌ను ఎంతో విలువైన జీవిత పాఠాలుగా అందించే గొప్ప‌ద‌నం మ‌న ఇండియ‌న్ సినిమాల్లో ఉన్నాయని, ప్ర‌పంచంలో సినీ చిత్రీక‌ర‌ణ‌కు సంబంధించిన ప్రాంతాల్లో మ‌న దేశం యొక్క సామ‌ర్థ్యం గురించి గొప్ప‌గా తెలియ‌జేశారు గ్లోబల్ స్టార్.

ఈ క్ర‌మంలో భారతదేశంలోని గొప్ప‌ సాంస్కృతిక వైవిధ్యం, సుందరమైన ప్రదేశాలు, ఖర్చు, సినిమా ప్రభావం, అత్యాధునిక సాంకేతికతతో పాటు ఇది చలనచిత్ర నిర్మాణానికి అనువైన ప్రదేశంగా ఎలా మారింద‌నే విష‌యాల‌ను చ‌ర‌ణ్ బ‌లంగా వినిపించారు. ఫిల్మ్ టూరిజం గురించి ఆయ‌న మాట్లాడుతూనే G20లోని స‌భ్య దేశాలు మ‌న దేశంలో చురుకైన భాగ‌స్వామ్యం వ‌హించాల‌ని తెలిపారు. ప్రస్తుతం చరణ్‌.. శంకర్‌ డైరెక్షన్‌లో `గేమ్‌ ఛేంజర్‌`లో నటిస్తున్నారు. నెక్ట్స్ బుచ్చిబాబుతో ఓ సినిమా చేయనున్నారు.