చిరంజీవి తల్లి అంజనాదేవి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు రూమర్స్ మొదలయ్యాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ వచ్చింది.
చిరంజీవి తల్లి అంజనాదేవి ఆరోగ్యంపై రూమర్స్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర, మెగా 157 చిత్రాలతో బిజీగా ఉన్నారు. విశ్వంభర మూవీ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోంది. మెగా 157 చిత్రాన్ని స్టార్ట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్నారు. చిరంజీవి సోదరుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తూనే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా వీరి తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురైనట్లు రూమర్స్ చక్కర్లు కొట్టాయి.
అంజనాదేవికి అనారోగ్యం కారణంగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆమె పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్లు సోషల్ మీడియాలో రూమర్స్ జోరందుకున్నాయి. అంతే కాదు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన తల్లి కోసం అమరావతి నుంచి హుటాహుటిన బయలుదేరినట్లు కూడా రూమర్స్ వచ్చాయి.
అంతా ఫేక్ న్యూస్, క్లారిటీ ఇచ్చిన పీఆర్ టీమ్
మంగళవారం రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ మీటింగ్ జరుగుతుంది. కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా ఇతర మంత్రులంతా హాజరయ్యారు. తన తల్లి అనారోగ్యం గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ క్యాబినెట్ మీటింగ్ నుంచి మధ్యలోనే బయటకు వచ్చేసినట్లు ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుసుకుని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అంజనా దేవి ఆరోగ్యం గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని ఎలాంటి ఆందోళన అవసరం లేదని తెలిపారు.
తల్లి పట్ల కుమారుల ప్రేమ
అంజనాదేవికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం అనే సంగతి తెలిసిందే. చిరంజీవి తరచుగా తన తల్లికి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఆమె పుట్టిన రోజు సెలబ్రేషన్ జరిగినా, ఇతర ఫ్యామిలీ ఫంక్షన్స్ జరిగినా ఆ దృశ్యాలని చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తమ తల్లి పట్ల చిరంజీవి, పవన్, నాగబాబు అత్యంత ప్రేమతో వ్యవహరిస్తుంటారు.
గతంలో అంజనా దేవి తాను దాచుకున్న డబ్బుని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు ఆమె చిరంజీవి నటన గురించి ఇంటర్వ్యూలలో చెబుతుంటారు.
