Cannes Film Festival 2022: ప్రపంచ సినిమా వేదికపై టాలీవుడ్ హవా.. చిరు, ప్రభాస్, రాజమౌళికి దక్కిన అరుదైన గౌరవం!
సుప్రసిద్ధ ప్రపంచ సినిమా వేదిక కాన్ ఫెస్టివల్ లో టాలీవుడ్ స్టార్స్ కి గౌరవం దక్కింది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ముగ్గురు స్టార్స్ ప్రభాస్, చిరంజీవి, దర్శకుడు రాజమౌళి ఫోటోలు గ్యాలరీలో ఏర్పాటు చేయడం జరిగింది.
75వ కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival 2022) ఫ్రాన్స్ దేశంలో అంగరంగ వైభంగా మొదలైంది. మే 17 నుండి 28 వరకు ఈ వేడుక ఘనంగా జరగనుంది. ప్రపంచ దేశాలకు చెందిన తారలు, చిత్ర ప్రముఖులు హాజరవుతుండగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కలర్ ఫుల్ గా మారిపోయింది. ఇక అద్భుతమైన డిజైనర్ వేర్స్ ధరించి రెడ్ కార్పెట్ పై సుందరీమణుల సోయగాలు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఇండియా నుండి పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. హీరోయిన్ దీపికా పదుకొనె, తమన్నా,పూజా హెగ్డే, లెజెండరీ నటుడు కమల్ హాసన్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తో పాటు పలువురు హాజరయ్యారు.
కాగా టాలీవుడ్ కి చెందిన ప్రభాస్, రాజమౌళి (Rajamouli), చిరంజీవికి కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అరుదైన గౌరవం దక్కింది. కేన్స్ ఫోటో గ్యాలరీలో ఈ ముగ్గురు స్టార్స్ ఫోటోలు ఏర్పాటు చేశారు. భారత చిత్ర పరిశ్రమకు చెందిన పలు పరిశ్రమలకు చెందిన ప్రముఖుల ఫొటోలతో పాటు టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్ (Prabhas) , చిరంజీవి, రాజమౌళి ఫోటోలు ఏర్పాటు చేశారు. ఇక రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన బాహుబలి, బాహుబలి 2 ప్రపంచ వేదికలపై ప్రదర్శించారు. ఆ సినిమాలతో వరల్డ్ వైడ్ ఇమేజ్ సొంతం చేసుకున్న వీరిద్దరి ఫోటోలు అక్కడ కనిపించాయి.
ఇక టాలీవుడ్ ఎవర్ గ్రీన్ స్టార్ గా ఉన్న చిరంజీవి... నాలుగు దశాబ్దాలుగా టాప్ హీరోగా ఉన్నారు. ఆయన గౌరవార్థం ఫోటోలు ఏర్పాటు చేశారు. ఇక కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తమన్నా, పూజా మెరవడం అరుదైన విషయం. సాధారణంగా బాలీవుడ్ హీరోయిన్స్ కి మాత్రమే ఆహ్వానం ఉంటుంది. ఈసారి పూజా హెగ్డే, తమన్నా సైతం హాజరయ్యారు. పది రోజులకు పైగా జరిగే కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేక ప్రత్యేక కార్యక్రమాలకు, సినిమా ప్రదర్శనలకు వేదిక కానుంది. కరోనా కారణంగా 2020లో కాన్ ఫెస్టివల్ వాయిదా పడింది.