పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ `బ్రో` విడుదలకు రెడీ అవుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాటకి సంబంధించిన అప్డేట్ వచ్చింది.
పవన్ కళ్యాణ్, సాయితేజ్ కలిసి `బ్రో` చిత్రంలో నటిస్తున్నారు. టైమ్ వాల్యూ తెలియజేసే కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. సముద్రఖని దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగులు అందించారు. సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్ విడుదలై ఆకట్టుకుంది. ఓ పాట రిలీజ్ అయ్యింది. `మై డియర్ మార్కండేయ` అంటూ సాగే పాట శ్రోతలని అలరించింది. ఇప్పుడు రెండో పాటని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
`బ్రో` నుంచి `జానవులే` అంటూ సాగే రెండో పాటని రేపు శనివారం విడుదల చేయబోతున్నారు. తిరుపతి వేదిక ఈ పాటని రిలీజ్ చేయనున్నారు. తిరుపతిలోని ఎన్వీఆర్ జయశ్యామ్ థియేటర్ లో ఈ పాట విడుదల కార్యక్రమం నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నాం ఈ పాట రిలీజ్ కానుంది. ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు తిరుపతి వెళ్లారు సాయితేజ్. ఈ సందర్భంగా ఆయన కాణిపాకం వినాయక స్వామి టెంపుల్ని సందర్శించారు. అక్కడ పూజలో పాల్గొని పండితుల ఆశీస్సులు తీసుకున్నారు.
రేపు జరగబోయే `బ్రో` సెకండ్ సాంగ్ రిలీజ్ కార్యక్రమంలో సాయితేజ్ పాల్గొననున్నారు. దీంతో ఇపట్నుంచే తిరుపతిలో కోలాహల వాతావరణం చోటు చేసుకుంది. ఈ పాట సాయితేజ్, హీరోయిన్ కేతికశర్మ కాంబినేషన్లో ఉండబోతుందని విడుదల చేసిన పోస్టర్ చూస్తుంటే తెలుస్తుంది. ఇందులో పవన్ కళ్యాణ్, సాయితేజ్లతోపాటు ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈనెల 28న సినిమా విడుదల కానుంది.
