అత్యధిక ఆదాయం అక్షయ్ దే.. ఫోర్బ్స్ లో ఏకైక ఇండియన్ స్టార్
ఇండియా నుంచి ఫోర్బ్స్ లో స్థానం పొందిన అక్షయ్ ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటారు. క్రమశిక్షణ, నిబద్దత ఆయన సొంతం. నిత్యం సినీ కార్మికులకు పని కల్పిస్తూ ఓ మిని ఇండస్ట్రీగా అక్షయ్ పేరు తెచ్చుకున్నారు.
బాలీవుడ్ సునామి అక్షయ్ కుమార్ మరోసారి అరుదైన ఘనత సాధించారు. అదాయంలో అంతర్జాతీయంగా సత్తా చాటారు. ప్రపంచంలోనే అత్యధిక సంపన్నుల జాబితాలో భారత్ నుంచి నిలిచిన ఏకైక స్టార్గా నిలిచారు. 2020ఏడాదికిగానూ అత్యధిక సంపాదన కలిగిన పది మంది సినీ సెలబ్రిటీల జాబితాని తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసింది. ఇందులో అక్షయ్ ఆరవ స్థానంలో నిలిచారు.
ఈ జాబితాలో అక్షయ్ కుమార్ ఒక్కరే ఇండియా నుంచి ఉండటం విశేషం. ఇక ఈ సారి ఆయన 363కోట్ల ఆదాయం (48.5మిలియన్ డాలర్ల)తో సంపాదించి, ఆరవ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. అయితే గతేడాది నాలుగో స్థానాన్నిసొంతం చేసుకున్న అక్షయ్ ఈ సారి రెండు స్థానాలు పడిపోవడం గమనార్హం.
ఇక ఈ జాబితాలో హాలీవుడ్ యాక్షన్ స్టార్ డ్వేన్ జాన్సన్ 87.5 మిలియన్ డాలర్లతో తొలి స్థానంలో నిలిచారు. గతేడాది కూడా ఆయనే మొదటి ర్యాంక్ని సాధించారు. మరోవైపు 71.5మిలియన్ డాలర్లతో ర్యాన్ రెనాల్డ్ రెండో స్థానంలో నిలిచారు. ఆయన ఇటీవల `డెడ్ఫూల్` చిత్రంతో బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. 58 మిలియన్ డాలర్లతో మార్క్ వాల్ బెర్గ్ మూడో స్థానంలో, 55 మిలియన్ డాలర్లతో బెన్ అప్లిక్ నాల్గో స్థానంలో, 54 మిలియన్ డాలర్లతో విన్ డీజిల్ ఐదో స్థానంలో నిలిచారు. అక్షయ్ది ఆరవ స్థానం కాగా, ఆ తర్వాత లిన్ మానుల్ మిరండా, విల్ స్మిత్, అడమ్ సాండ్లర్, జాకీ చాన్ వరుసగా ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది స్థానాలను కైవసం చేసుకున్నారు.
ఇక ఇండియా నుంచి ఫోర్బ్స్ లో స్థానం పొందిన అక్షయ్ ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటారు. క్రమశిక్షణ, నిబద్దత ఆయన సొంతం. నిత్యం సినీ కార్మికులకు పని కల్పిస్తూ ఓ మిని ఇండస్ట్రీగా అక్షయ్ పేరు తెచ్చుకున్నారు. ఆయన నటించే సినిమాలు ఏడాదికి వెయికోట్ల వ్యాపారం చేస్తుంటాయి. ప్రతి సినిమా మినిమమ్ గ్యారంటీ. ఒక్కో సినిమా తక్కువలో తక్కువ రెండు వందల కోట్లు వసూలు చేస్తుండటం విశేషం. ఇక కరోనా విజృంభనతో ప్రధాని సహాయనిధికి రూ.25కోట్లు విరాళంగా అందించిన విషయం తెలిసిందే. అలాగే ముంబయి కోసం మూడు కోట్లు విరాళంగా అందించి తన గొప్ప మనసును చాటుకున్నారు.
గతేడాది `కేసరి`, `మిషన్ మంగళ్`, `హౌజ్ఫుల్ 4`, `గుడ్ న్యూస్` చిత్రాలతో మెరిశారు. ఈ నాలుగు సినిమా విజయాలను సాధించాయి. దాదాపు ఎనిమిది వందల కోట్లు వసూలు చేశాయి. ప్రస్తుతం ఆయన నుంచి దాదాపు అరడజను సినిమాలు తెరకెక్కుతున్నాయి. అందులో `సూర్యవంశీ`, `లక్ష్మీబాంబ్` విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటితోపాటు `పృథ్వీరాజ్`, `అత్రాంగి రే`, `బచ్చన్ పాండే`, `బెల్ బాటమ్` చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో `లక్ష్మీబాంబ్` హాట్స్టార్లో విడుదల కానుంది. మిగిలిన సినిమాలు థియేటర్ కోసం వెయిటింగ్.