కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన బాలకృష్ణ దంపతులు..
ఇటీవల రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం కృష్ణంరాజు కుటుంబాన్ని నటుడు నందమూరి బాలకృష్ణ దంపతులు పరామర్శించారు.
తెలుగు తెర రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. గత నెల(సెప్టెంబర్) 11న కృష్ణంరాజు అనారోగ్యంతో కన్నుమూశారు. తాజాగా కృష్ణంరాజు ఫ్యామిలీని పరామర్శించారు నందమూరి బాలకృష్ణ దంపతులు. సతీసమేతంగా కృష్ణంరాజు ఇంటికి వెళ్లిన బాలయ్య, వసుందరలు కృష్ణంరాజు చిత్రపటానికి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవిని పరామర్శించారు. రెబల్ స్టార్తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు బాలయ్య.
కృష్ణంరాజు చనిపోయిన సమయంలో బాలయ్య విదేశాల్లో తన సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `ఎన్బీకే107` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ సమయంలో ఈ సినిమా షూటింగ్ టర్కీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. దీంతో ఆయన కృష్ణంరాజు పార్థివ దేహాన్ని చూడలేకపోయారు. షూటింగ్ అయిపో ఇండియా వచ్చిన ఆయన ఇటీవల `ఆహా` కి సంబంధించిన `అన్స్టాపబుల్ 2` షూటింగ్లో బిజీ అయ్యారు.
ఇప్పుడు ఫ్రీ అయిన బాలయ్య వెంటనే అటు మహేష్ బాబు కుటుంబాన్ని పరామర్శించారు. ఇప్పుడు కృష్ణంరాజు ఇంటికెళ్లి ఆయన సతీమణి శ్యామలాదేవి పరామర్శించి తన సానుభూతిని తెలియజేశారు. ఎన్నో సంవత్సరాలుగా తమ మధ్య విడదీయరాని బంధం ఉందని, నాన్నగారి సమయం నుంచి కృష్ణంరాజుని చూస్తూ పెరిగాను అంటూ సినిమా ఇండస్ట్రీకి ఆయన ఎంతో సేవ చేశారని కొనియాడారు బాలకృష్ణ.
అద్భుతమైన నటుడితో తనకు కూడా కలిసి నటించే అవకాశం వచ్చిందని, తామిద్దరం `సుల్తాన్`, `వంశోద్ధారకుడు` సినిమాలలో కలిసి నటించామనే విషయం గుర్తు చేసుకున్నారు బాలకృష్ణ. అలాగే ఆయనతో గడిపిన క్షణాలను అభిమానులతో పంచుకున్నారు. కృష్ణంరాజు గారు లేని లోటు ఎవరూ పూడ్చలేనిది అంటూ కుటుంబ సభ్యులను ఓదార్చి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న `ఎన్బీకే107` చిత్రం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. అలాగే ఆయన హోస్ట్ గా చేస్తున్న `అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే 2` షో మొదటి ఎపిసోడ్ ఈ శుక్రవారం(అక్టోబర్ 14) నుంచి `ఆహా`లో స్ట్రీమింగ్ కానుంది.