ఆయన తెలుగు సినిమాకు గర్వకారణం... కళాతపస్వి మృతిపై బాలయ్య, కమల్ సంతాపం!
దిగ్గజ దర్శకులు కే.విశ్వనాథ్ మృతి చెందిన విషయం తెలిసిందే. కళాతపస్విగా పేరుగాంచిన విశ్వనాథ్ మరణంఫై పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ, కమల్ హాసన్ తో పాటు పలువురు సంతాపం ప్రకటించారు.
లోకనాయకుడు కమల్ హాసన్ తో కే. విశ్వనాథ్ కి విడదీయరాని అనుబంధం ఉంది. స్వాతిముత్యం, సాగరసంగమం వంటి అరుదైన చిత్రాలు వీరి కాంబినేషన్ లో తెరకెక్కాయి. 1995లో కమల్ హాసన్ తో శుభసంకల్పం టైటిల్ తో ఓ చిత్రం చేశారు. ఈ సినిమాతో విశ్వనాథ్ నటుడిగా మారడం విశేషం. విశ్వనాథ్ గారిని కమల్ తరచుగా కలుస్తూ ఉంటారు. ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన విశ్వనాథ్ గారిని కలవకుండా ఉండరు. ఇటీవల కూడా కమల్ విశ్వనాథ్ ఇంటికి వెళ్లారు.
కమల్ ఆయన్ని గురువుగా భావిస్తారు. అంతటి ఆత్మీయులు మరణించడం కమల్ ని కలచివేస్తుంది. ఆయన సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ సందేశం పోస్ట్ చేశారు. జీవితాన్ని, కళను ఆయన గొప్పగా అర్థం చేసుకున్నారు. విశ్వనాథ్ గారికి మరణం లేదంటూ కామెంట్ చేశారు.
అలాగే నందమూరి బాలకృష్ణ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చిత్ర పరిశ్రమకు తీరని లోటుగా అభివర్ణించారు. కళా తపస్వి కె. విశ్వనాథ్ గారు కన్నుమూయడం తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటు.. భారతీయ సంస్కృతి సంప్రదాయలు మరీ ముఖ్యంగా మన తెలుగు దనాన్ని అణువణువున ప్రతిబింబించే ల ఆయన తీసిన అత్యద్భుత చిత్రాలు తెలుగు సినిమా కే గర్వకారణము.. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసి తెలుగు చలనచిత్ర పరిశ్రమకే వన్నెతెచ్చి ప్రతి తెలుగు వాడు గర్వించేలా చేసిన దిగ్గజ దర్శకుడి మరణం తీవ్రవిచారానికి గురిచేసింది.కళా తపస్వి ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను..
మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్, వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ సంతాపం ప్రకటించారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. హీరో రవితేజ సైతం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆయన మరణవార్త విని హృదయం ద్రవించింది అన్నారు. ఆయన చిత్రాల జ్ఞాపకాలు మనతోనే ఉంటాయని విశ్వనాథ్ గారి కీర్తి కొనియాడారు.