ప్రభాస్-అమితాబ్ వెండితెరపై మొదటిసారి: బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన నాగ్ అశ్విన్
లెజెండరీ నటుడు లేకుండా లెజెండరీ మూవీ ఎలా పూర్తవుతుంది. అందుకే లెజెండ్ అమితాబ్ ని రంగంలోకి దించారు. ప్రభాస్ 21లో కీలక పాత్ర కోసం అమితాబ్ బచ్చన్ ని తీసుకున్నట్లు చిత్ర యూనిట్ నేడు ప్రకటించడం జరిగింది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 21వ చిత్రం యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ప్రకటించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి కాగా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రం కోసం సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావును తీసుకున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ కథపై ఇప్పటికే అనేక పుకార్లు రావడం జరిగింది.
ఐతే ప్రభాస్ బర్త్ డే రెండు వారాల ముందే బిగ్ అనౌన్స్మెంట్ చేశారు చిత్ర యూనిట్. చెప్పిన విధంగా నేడు ఉదయం 10:00 గంటలకు ఆసక్తికర అప్డేట్ తో వచ్చేశారు. లెజెండరీ మూవీని లెజెండ్ లేకుండా ఎలా పూర్తి చేస్తాం అంటూ...అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటించారు. తాజా అప్డేట్ మూవీపై ఆసక్తి మరింత పెంచేసింది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ మూవీని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తుంది.
ఇక ప్రభాస్ 21లో అమితాబ్ పాత్ర ఏమై ఉంటుందా అనే ఆసక్తి అందరిలో మొదలైంది. ఏది ఏమైనా ప్రభాస్ 21 కోసం అమితాబ్ ని తీసుకోవడం కలిసొచ్చే అంశమే. ప్రస్తుతం రాధే శ్యామ్ మూవీలో నటిస్తున్న ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ తో ఆదిపురుష్ ప్రకటించారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడుగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించనున్నారు. ఈ ప్రాజెక్ట్ పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది.