ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రం రిలీజైన అన్ని భాషల్లోనూ బ్లాక్బస్టర్ విజయం సాధించింది. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో బన్నీకు జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప ది రైజ్’. లాస్ట్ ఇయిర్ డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర రూ.350 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి అల్లుఅర్జున్కు నేషన్ వైడ్ గుర్తింపు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా బాలీవుడ్లో ఈ చిత్రం ఎలాంటి ప్రమోషన్లు చేయకుండానే రూ.100 కోట్ల నెట్ సాధించి అక్కడి విశ్లేషకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ కోసం ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది.కాస్త లేటుగా షూటింగ్ మొదలైంది.
అదే సమయంలో ఈ భారీ సినిమాకు భారీగా ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. సినిమాపై హైప్ తీసుకురావడానికి టీజర్ను ‘అవతార్-2’ థియేటర్లలో స్క్రీనింగ్ చేయబోతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ జరగలేదు. ఫ్యాన్స్ కు నిరాశ ఎదురైంది. అయితే ఇప్పుడు సంక్రాంతి సందర్బంగా ఈ సినిమా పవర్ ఫుల్ ఫస్ట్ గ్లింప్ ఒకటి వదిలి...సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అఫీషియల్ ప్రకటన ఏమీ రాలేదు కానీ వస్తుందని నమ్ముతున్నారు. అదే కనుక జరిగితే మామూలుగా ఉండదు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలోని ఓ డైలాగు లీక్ అయ్యిందంటూ ప్రచారం జరుగుతోంది. ఆ డైలాగు నిజంగా సినిమాలో ఉందో లేదో కానీ ఓ రేంజిలో ఫ్యాన్స్ కు నచ్చేస్తోంది. ఇంతకీ ఆ డైలాగు ఏమిటంటే...
"అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేసాయంటే పులి వచ్చిందని అర్ధం.. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప రాజ్ వచ్చాడని అర్థం"
ఇక ఆల్రెడీ ఈ చిత్రం షూటింగ్ మొదలై జరుగుతోంది. పుష్ప రెండో పార్టు షూటింగ్ క్రితం నెల అంటే డిసెంబర్ 17, 18, 19 మూడు రోజుల పాటు సికింద్రాబాద్ లోని ఒక గవర్నమెంట్ కాలేజీ లో షూటింగ్ జరుగిందని తెలిసింది. పుష్ప మొదటి పార్టు లో ఎక్కడ అయితే ఆపారో ఆ తరువాత జరగబోయే సన్నివేశాలు కొన్ని ముందుగా చిత్రీకరించాలని దర్శకుడు సుకుమార్ అనుకున్నట్టుగా తెలిసింది. అలాగే మలయాళం నటుడు ఫహాద్ ఫాజిల్ చాల బిజీ గా ఉండటం తో అతని డేట్స్ కుదరటం కూడా చాలా కష్టం అని తెలిసింది. అందువల్ల అతను ఒక మూడు రోజుల పాటు ఈ పుష్ప సినిమా షూటింగ్ కి డేట్స్ ఇచ్చాడని, అందువల్ల అతని సన్నివేశాలను ముందుగా మొదలెడుతున్నారని తెలిసింది.
మరో ప్రక్క పుష్ప సినిమాలో తాను చెప్పిన డైలాగ్ తగ్గేదేలే ఎలా హిట్ అయిందో మనకు తెలిసిందే.అయితే పుష్ప2 లో మాత్రం అస్సలు తగ్గేదేలే అనే డైలాగ్ ఉండబోతుంది అంటూ అల్లు అర్జున్ తన సినిమా గురించి అప్డేట్ గతంలో ఇచ్చారు. దాంతో ఈ సినిమా గురించి అభిమానులు పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తూ అస్సలు తగ్గకూడదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
