Asianet News TeluguAsianet News Telugu

అఫీషియల్: ‘లవ్ స్టోరీ’ డిజిటల్ రైట్స్ ‘ఆహా’ కే

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో త్వరలోనే నాలుగు కొత్త సినిమాలు రాబోతున్నాయి. ఇందులో డబ్బింగ్ సినిమాలే ఎక్కువగా వస్తున్నాయని విమర్శలు వస్తున్న క్రమంలో కొత్త సినిమాలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది ఆహా. లవ్ స్టోరీతో పాటు మరికొన్ని మూవీలు రాబోతున్నట్లు తెలిపింది. అవేంటో ఇక్కడ చూడండి.

Aha Acquires Digital Rights Of Love Story jsp
Author
Hyderabad, First Published Jul 3, 2021, 9:25 PM IST

 టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో.. నాగ చైతన్య , సాయిపల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం ‘లవ్ స్టోరీ’.  ఈ సినిమా షూటింగ్  పూర్తై రిలీజ్ కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ లేకుంటే ఏప్రిల్ 16నే విడుదల కావాల్సింది. థియేటర్లు ఆరంభం కాగానే ‘లవ్ స్టోరి’ విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఈ చిత్రాన్ని ఆహాలో స్ట్రీమింగ్ చేస్తారట. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. దీంతో పాటు గీతా ఆర్ట్స్ లో తెరకెక్కుతున్న అఖిల్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, నాగశౌర్య ‘లక్ష్య’ డిజిటల్ హక్కులు కూడా ఆహా సొంతం చేసుకుంది. 

ఇక కరోనా సెకండ్ వేవ్ తరువాత విడుదల కాబోయే పెద్ద సినిమా ఇదేనంటూ కథనాలు మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో నిర్మాత సునీల్ నారంగ్ ఈ సినిమా రిలీజ్ విషయమై క్లారిటీ ఇచ్చారు. సునీల్ నారంగ్ మాట్లాడుతూ... తెలంగాణలో లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ.. నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది. రాత్రిపూట కర్ఫ్యూ పూర్తిగా తొలగించిన తరువాత మాత్రమే ఎవరైనా సినిమా రిలీజ్ విషయం ఆలోచిస్తారని.. మూడు షోలతో థియేటర్లు నడిపించడానికి ఎవరూ ముందుకు రారని అన్నారు. అలానే తెలంగాణతో పాటు ఏపీలో కరోనా పరిస్థితులు థియేటర్లు తెరవడానికి అనుకూలంగా ఉండాలి కదా.. అని చెప్పారు.

 అయితే ఇప్పుడున్న ట్రెండ్ ని చూస్తూంటే జూలై రెండో వారానికి పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నామని అన్నారు. ఒకవేళ థియేటర్లు తెరవటానికి ఫర్మిషన్స్  లభించినా.. నైట్ కర్ఫ్యూ తీసేసిన తరువాతే కొత్త సినిమాలు రిలీజ్ లు ఉంటాయని స్పష్టం చేశారు. ఏది ఏమైనా ‘లవ్ స్టోరీ’ సినిమా నైట్ కర్ఫ్యూ తీసిన వారం తరువాత విడుదల అవుతుందని క్లారిటీ ఇచ్చారు.
 
అమిగోస్‌ క్రియేషన్స్‌పై తెరకెక్కిన ‘లవ్‌స్టోరీ’ కు శేఖర్ కమ్ముల  దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్‌పై కె నారాయణదాస్ నారంగ్, పి రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. ప‌వ‌న్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి  తోపాటు రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios